DGP Anurag Dhankhar | త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కర్(Anurag Dhankhar) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అగర్తలాలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో సోమవారం మధ్యాహ్నం గన్తో కాల్చుకొని బలవన్మరణం చెందారు. గమనించిన సిబ్బంది వెంటనే ఆయనను అగర్తలాలోని గోవింద్ వల్లభ్ పంత్ హాస్పిటల్కు తరలించగా అప్పటికే ధన్కర్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, ఈ ఘటనపై అధికారిక దర్యాప్తు ప్రారంభమైందని అధికారులు తెలిపారు. కాగా, 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అనురాగ్ ధన్కర్ వృత్తిలో ఉన్నతంగా రాణించారు. పలు అవార్డులు గెలుపొందారు. అనురాగ్ మే 2025లో త్రిపుర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా బాధ్యతలు చేపట్టారు.
రాష్ట్ర పోలీస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టడానికి ముందు త్రిపురలో డైరెక్టర్ జనరల్ (ఇంటెలిజెన్స్)గా పనిచేశారు. అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)లో విశిష్టమైన సేవలందించారు. తన పదవీకాలంలో అనేక కీలకమైన (high-profile) కేసుల దర్యాప్తును చేపట్టి అందరి మన్ననలు పొందారు.