Benjamin Basumatary | అసోం రాష్ర్టానికి చెందిన యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్) నేత కరెన్సీ నోట్లపై నిద్రిస్తున్న ఫొటో ఒకటి వైరలైంది. లోక్సభ ఎన్నికల వేళ ఇది రాజకీయ దుమారానికి దారి తీసింది. అతడిని సస్పెండ్ చేసినట్లు పార్టీ ప్రకటించింది.
యూపీపీఎల్కు చెందిన విలేజ్ కౌన్సిల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడైన బెంజమిన్ బాసుమతరీ ఒంటిపై కేవలం టవల్ మాత్రమే ధరించి తన పరుపుపై మొత్తం 500 నోట్లను పరిచి వాటిపై పడుకున్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. అయితే ఈ ఫొటో ఎప్పుడో పాతదని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే దీన్ని ఇప్పుడు కొందరు పనిగట్టుకుని వైరల్ చేస్తున్నారని అతని సన్నిహితులు తెలిపారు. బెంజమిన్ బాసుమతరీని పార్టీ సస్పెండ్ చేయటమే గాక అతడి పదవి కూడా ఊడిందని చెప్పుకొచ్చారు.