భార్యాభర్తలు కలిసి జీవించలేని పరిస్థితుల్లో విడాకులను వెంటనే మంజూరు చేయవచ్చంటూ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. కొన్ని షరతులతో ఆరు నెలలపాటు నిరీక్షించాలన్న నిబంధనను సడలించవచ్చంటూ జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు నేరుగా విడాకులు మంజూరు చేసే అంశంపై 2016 జూన్లో దాఖలైన పిటిషన్లను ధర్మాసనం విచారించింది.
న్యూఢిల్లీ, మే 1: విడాకుల మంజూరు విషయంలో సుప్రీం కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. కలిసి ఉండలేని దంపతులకు వెంటనే విడాకులు మంజూరు చేయనున్నట్టు ప్రకటించింది. విడాకుల కోసం ఇక ఆరు నెలలు వేచి చూడనక్కరలేదని, విడాకుల మంజూరు చేసే అధికారం రాజ్యాంగంలోని అధికరణ 142 తమకు కల్పించిందని స్పష్టం చేసింది. దంపతుల మధ్య వైవాహిక బంధం సరిదిద్దలేనంతగా, కోలుకోలేని విధంగా విచ్ఛిన్నం అయితే వారి పరస్పర అంగీకారంతో వెంటనే ఆ వివాహాన్ని రద్దు చేయవచ్చునని, విడాకుల కోసం తప్పనిసరిగా 6 నెలలు వేచి చూడాల్సిన అవసరం లేదని వివరించింది.
అయితే అది కొన్ని షరతులకు లోబడి ఉండాలని జస్టిస్ సంజయ్ ఖాన్ కౌల్, జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేఎం మహేశ్వరితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ప్రకటించింది. మెయింటెనెన్స్, భరణం, పిల్లలపై హక్కులు తదితర అంశాలను ఎలా సమతుల్యం చేయాలన్న అంశాన్ని కూడా బెంచ్ వివరించింది. ‘142 అధికరణ కోర్టుకు కల్పించిన విస్తృత అధికారం ప్రకారం ఇష్టం లేకుండా కాపురం చేస్తూ తక్షణం విడిపోవాలని కోరుకునే దంపతులకు విడాకులు సాధ్యమే. ఈ విషయంలో అలాంటి వారికి పూర్తి న్యాయం జరుగుతుంది. కోర్టును ఆశ్రయించిన దంపతుల కాపురం పూర్తిగా విచ్ఛిన్నం అయినట్టు, వారిని తిరిగి కలిపే అవకాశాలు లేవని కోర్టు భావిస్తే దీనిని వినియోగించడం వల్ల ఇరు పార్టీలకు మంచే జరుగుతుంది. సరిదిద్దలేని విధంగా కాపురాలు విచ్ఛిన్నమైన జంటల కేసులకు సంబంధించి 142 ఆర్టికల్ను అనుసరించి వారికి విడాకులు మంజూరు చేయవచ్చని కోర్టు నిర్ణయించింది’ అని ధర్మాసనం ప్రకటించింది. వివాహం రద్దు కోసం పార్టీలు నేరుగా హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించరాదన్న వాదనను సుప్రీం సమర్థించింది.
కేసు వివరాలివీ..హిందూ వివాహ చట్టం సెక్షన్ 13-బీ ప్రకారం ఏదైనా వివాహాన్ని రద్దు చేయాలని వారు కుటుంబ కోర్టును ఆశ్రయిస్తే ఆరు నెలల పాటు తప్పనిసరిగా విడాకుల కోసం వేచి ఉండాలి. అయితే, పరస్పర సమ్మతితో విడిపోవాలని కోరుకునే వారు, కోలుకోలేని విధంగా సంబంధాలు విచ్ఛిన్నమై వారి బంధాన్ని పునరుద్ధరించలేని పరిస్థితి ఉందని కోర్టు భావించినప్పుడు వారికి ఫ్యామిలీ కోర్టుతో సంబంధం లేకుండా 142 ఆర్టికల్ ప్రకారం కోర్టు ఆదేశాలను వెలువరించే అంశంపై వాదోపవాదాలు జరిగాయి. ఏడేండ్ల పాటు దీనిపై వాదోపవాదాల అనంతరం గత ఏడాది సెప్టెంబర్ 29న కేసు తీర్పును రిజర్వ్ చేశారు. ఈ కేసులో అడ్వకేట్లు ఇందిరా జైసింగ్, బీ గిరి, కపిల్ సిబల్, దుష్యంత్ దవే, మీనాక్షి అరోరాను కోర్టుకు సహాయపడేందుకు అమిక్ క్యూరీలుగా నియమించగా, వీ మోహన్, జయ్సావ్లా తదితరులు కేసులో వాదించారు.
పెండ్లి అయ్యిందని తెలిసీ సహజీవనం చేస్తే చీటింగ్ కాదు
కోల్కతా: పురుషుడికి పెండ్లి అయ్యిందని తెలిసీ అతడితో సహజీవనం చేస్తే.. అది చీటింగ్ కిందికి రాదని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. తనతో శారీరక సంబంధాన్ని కొనసాగించి, పెండ్లి చేసుకోవాలని కోరిన వెంటనే మొహం చాటేసిన వ్యక్తిపై లైంగికదాడి, క్రిమినల్ కేసుల కింద చర్యలు తీసుకోవాలని ఒక మహిళ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను కలకత్తా హైకోర్టు కొట్టివేసింది. బాధితురాలు ఇష్టపూర్వకంగానే అతడితో సంబంధం ఏర్పర్చుకున్నదని, అతనిపై లైంగికదాడి, క్రిమినల్ కేసులు నమోదు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేస్తూ సోమవారం తీర్పు చెప్పింది. కేసు వివరాల్లోకి వెళ్తే.. అప్పటికే పైండ్లెన వ్యక్తితో ఓ మహిళ సహజీవనం చేశారు. అతడికి పెండ్లి అయిన విషయం కూడా ఆ మహిళకు తెలుసు. వివాహం చేసుకుంటానని మభ్యపెట్టి నిందితుడు తనతో కొన్ని రోజులుగా శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఇప్పుడు పెండ్లికి నిరాకరిస్తున్నందున అతడిపై అత్యాచారం, క్రిమినల్ కేసుల్లో చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు కలకత్తా హైకోర్టులో కేసు దాఖలు చేశారు. 417 (మోసం), 376 (లైంగికదాడి) సహా పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు.