Supreme Court | హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో అనర్హతకు గురైన ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనర్హతను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషన్పై ఈ నెల 18న విచారణ జరుపనున్నది. ఆరుగురు ఎమ్మెల్యేలు ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా విప్ను ధిక్కరించినందుకు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఫిబ్రవరి 27న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్కు అనుకూలంగా ఓటు వేసిన కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆ తర్వాత బడ్జెట్పై ఓటింగ్కు దూరంగా ఉన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కారణంగా ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలలో రాజిందర్ రాణా, సుధీర్ శర్మ, ఇందర్ దత్ లఖన్పాల్, దేవిందర్ కుమార్ భుత్తు, రవి ఠాకూర్, చేతన్య శర్మ ఉన్నారు. హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీలో 68 మంది ఎమ్మెల్యేలున్నారు. అనర్హత వేటువేయడంతో ఎమ్మెల్యేల సంఖ్య 62 తగ్గింది. కాంగ్రెస్కు ఇంతకు ముందు 40 మంది సభ్యుల బలం ఉండగా.. ఈ సంఖ్య 36కి పడిపోయింది.