Supreme Court | ఢిల్లీలో కొత్త ప్రధాన కార్యదర్శి నియామకంపై ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం మధ్య పంచాయితీ నడుస్తున్నది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవగా.. విచారణ జరుపుతున్నది. అయితే, చీఫ్ సెక్రెటరీ నియామకానికి పేర్లపై చర్చించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి ఎందుకు కలవలేకపోయారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ ముఖ్యమంత్రి ఒకరినొకరు ఎందుకు కలవరని ప్రశ్నించారు.
కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ ఎప్పుడూ ప్రధాన కార్యదర్శిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నియమిస్తుందని తెలిపారు. సీజేఐ కల్పించుకుంటూ ప్రభుత్వం పనిచేసే పద్ధతిని కలిగి కలిగి ఉండాలని.. మీరిద్దరు మాకు మార్గాన్ని అందించగలరని అనుకుంటున్నానన్నారు.
లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ప్రధాన కార్యదర్శి నియామకం విషయంలో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని, ఇది బాధాకరమన్నారు.
పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 28న మరోసారి విచారించనునున్నది. ఎలాంటి సంప్రదింపులు లేకుండా కొత్త సీఎస్ను నియమించడం, పదవీకాలాన్ని కేంద్రం పొడగించడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతున్నది. ప్రస్తుత ఢిల్లీ సీఎస్ నరేశ్ కుమార్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ఎలాంటి సంప్రదింపులు లేకుండా సీఎస్ నియామకంపై కేంద్రం ఎలా ముందుకెళ్తుందని ఢిల్లీ ప్రభుత్వం ప్రశ్నించింది. కేంద్రం నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ)చట్టాన్ని ఆగస్టులో నోటిఫై చేసిన విషయం తెలిసిందే.