ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్పై సుప్రీంకోర్టు నిలువునా చీలిపోయింది. రాజ్యాంగ ధర్మాసనం 103వ రాజ్యాంగ సవరణ 3:2 నిష్పత్తిలో నెగ్గుకువచ్చింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ముగ్గురు మెజారిటీ న్యాయమూర్తులు ఈడబ్ల్యూఎస్ కోటాను సమర్థించగా సీజేఐతో సహా ఇద్దరు వ్యతిరేకించారు. 50% రిజర్వేషన్ల పరిమితి దాటొచ్చని ముగ్గురు, దాట కూడదని ఇద్దరు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ, నవంబర్ 7: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) వారికి విద్య, ఉపాధి కల్పనలో 10 శాతం రిజర్వేషన్ కల్పించే 103వ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు సమర్థించింది. దీనిపై రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు కాకుండా 3:2 నిష్పత్తిలో మెజారిటీ తీర్పును వెలువరించింది. రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఆ సవరణ ఉల్లంఘించడం లేదని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ విషయమై దాఖలైన మొత్తం 40 పిటిషన్లపై సోమవారం నాలుగు వేర్వేరు తీర్పులు వెలువరించింది. ధర్మాసనంలోని జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం త్రివేదీ, జస్టిస్ జేబీ పార్దీవాలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు అనుకూలంగా తీర్పు చెప్పగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్తో పాటుగా జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ ఆ రిజర్వేషన్ను తిరస్కరిస్తూ మైనారిటీ తీర్పు వెలువరించారు. 35 నిమిషాల వ్యవధిలో న్యాయమూర్తులు నాలుగు తీర్పులను కోర్టులో చదివి వినిపించారు. 2019లో తెచ్చిన ఆ సవరణ రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించడం లేదని జస్టిస్ మహేశ్వరి తన తీర్పులో పేర్కొన్నారు.
నిస్సహాయ వర్గం లేదా తరగతి సమానత్వ సమాజం దిశగా అడుగులు వేసేందుకు చేపట్టిన సమ్మిళిత తత్వంతో కూడిన నిర్ణయాత్మక చర్యగా ఆ రిజర్వేషన్ను చూడాలని తెలిపారు. వివక్షతో కూడుకొని ఉందన్న కారణంగా 103వ సవరణను కొట్టివేయలేమని జస్టిస్ త్రివేది అభిప్రాయపడ్డారు. ఆర్థిక బలహీన వర్గాల కోసం పార్లమెంటు చేపట్టిన నిర్ణయాత్మక చర్యగానే దానిని చూడాలని నొక్కిచెప్పారు. ఆ ఇద్దరితో జస్టిస్ జేబీ పార్దీవాలా ఏకీభవించారు. సవరణ చెల్లుతుందని తెలిపారు. అయితే రిజర్వేషన్ అనేది సామాజికన్యాయ సాధనకు ఉద్దేశించిందని, దానిని నిరవధికంగా కొనసాగిస్తే స్వార్థపర అంశంగా మారుతుందని హెచ్చరించారు. న్యాయమూర్తి రవీంద్రభట్ మెజారిటీతో విభేదించి మైనారిటీ తీర్పు వెలువరించారు. ఈడబ్ల్యూఎస్ కోటా సవరణను కొట్టివేశారు. ఆ సవరణ రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని అది ఉల్లంఘిస్తున్నదని అభిప్రాయపడ్డారు. జస్టిస్ భట్ అభిప్రాయంతో సీజేఐ జస్టిస్ లలిత్ ఏకీభవించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సోమవారమే పదవీవిరమణ చేసి ఆయన వెలువరించిన తుది తీర్పుల్లో ఇదొకటి కావడం విశేషం.
సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పు
ఆరున్నర రోజులపాటు ఈ కేసుపై అప్పటి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తదితర సీనియర్ న్యాయవాదుల సుదీర్ఘ వాదనలను విన్న తర్వాత సర్వోన్నత న్యాయస్థానం సెప్టెంబర్ 27న విచారణను ముగించి తీర్పును వాయిదా వేసింది. విద్యావేత్త మోహన్ గోపాల్ వాదనలు ప్రారంభిస్తూ ఈడబ్ల్యూఎస్ కోటా అనేది రిజర్వేషన్ల భావనను ధ్వంసం చేసేందుకు జరిగిన మోసకారి, దొడ్డిదారి ప్రయత్నమని దుయ్యబట్టారు. తమిళనాడు తరఫున శేఖర్ నాఫడే వాదిస్తూ ఈడబ్ల్యూఎస్ కోటాను వ్యతిరేకించారు. ఆర్థిక ప్రమాణం వర్గీకరణకు ప్రాతిపదిక కాజాలదని పేర్కొన్నారు. ఈ రిజర్వేషన్ను సమర్థించేముందు ఇందిరా సాహనీ (మండల్) తీర్పును మరోసారి చదవాలని సూచించారు. అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ సవరణను బలంగా సమర్థించారు. ఈ రిజర్వేషన్ భిన్నమైనదని అన్నారు.
రిజర్వేషన్లు 50% దాటొచ్చు
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ 50% పరిమితికి ఎగువన ఈ కొత్త ఈ డబ్ల్యూఎస్ కోటాను ప్రవేశపెట్టారు. 103వ రాజ్యాంగ సవరణను సమర్థించిన న్యాయమూర్తి దినేశ్ మహేశ్వరి 50 శాతం పరిమితి అనేది దాటడానికి వీల్లేని గీత ఏమీ కాదని అన్నారు. సదరు పరిమితిని దాటడం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఏరకంగానూ ఉల్లంఘించడం కిందకు రాదని పేర్కొన్నారు. ఆర్థిక ప్రాతిపదిక, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పేదలను ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి మినహాయించడం, 50% పరిమితి అనుల్లంఘనీయం అన్న మూడు అంశాలపై ప్రధానంగా నిర్ణయం జరిగిందని తెలిపారు. ఈ మూడింటిలో ఏదీ రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రాదని మెజారిటీ తీర్పు స్పష్టం చేసింది. 50% పరిమితి అనేది దాటకూడని నియమం ఏమీ కాదని అభిప్రాయపడింది. ఆ పరిమితి పవిత్రమైందన్న వాదనలను తోసిపుచ్చింది. 50% పరిమితి అనేది 15(4), 15(5), 16(4) రాజ్యాంగ అధికరణాల పరిధిలోని రిజర్వేషన్లకు మాత్రమే వర్తిస్తుందని నొక్కిచెప్పింది. జస్టిస్ బేలా ఎం త్రివేదీ, జస్టిస్ పార్దీవాలాలిద్దరూ జస్టిస్ మహేశ్వరి తీర్పుతో ఏకీభవించారు.
దీనితో విభేదించిన మైనారిటీ న్యాయమూర్తులు 50% పరిమితిని ఉల్లంఘించడం వల్ల మరిన్ని చీలికలు వచ్చి విభాగాలు ఏర్పడుతాయని హెచ్చరించారు. సమానత్వ సూత్రం అప్పుడు రిజర్వేషన్ హక్కుగా మారిపోతుందని, మనం మళ్లీ చంపకం దురైరాజన్ రోజులకు వెళ్లిపోతామని మైనారిటీ తీర్పు వెలువరించిన న్యాయమూర్తి రవీంద్ర భట్ తెలిపారు. ఆయన తీర్పుతో సీజేఐ ఏకీభవించారు. రిజర్వేషన్లను తాత్కాలిక, అసాధారణ ఏర్పాటుగానే చూడాలని, లేదంటే అవి సమానత్వ సూత్రాన్ని మింగేస్తాయన్న అంబేద్కర్ మాటలను గుర్తుంచుకోవాలని జస్టిస్ భట్ పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫున హాజరైన న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ 50% పరిమితి పవిత్రమైందని, దానిని ఉల్లంఘిచడం దిగ్భ్రాంతికరమని వాదించారు. తరగతులను ముక్కచెక్కలుగా చీల్చడం, సంక్షేమ కార్యకలాపాల కింద రిజర్వేషన్ల కట్లు తెంచడం వల్ల రాజ్యాంగ మౌలిక సూత్రానికి భంగం కలుగుతుందని తెలిపారు.
రాజ్యాంగ ఉల్లంఘన కాదు
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ అనేది సమానత్వ సమాజం స్థాపన దిశగా తీసుకున్న నిర్ణాయక చర్య. అది రాజ్యాంగాన్ని ఏరకంగానూ ఉల్లంఘించడం లేదు. సమానత్వం, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయడం లేదు. ప్రస్తుత రిజర్వేషన్లకు అదనంగా రిజర్వేషన్లను కల్పించడం రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకం కాదు. వివక్ష కారణంగా సవరణను కొట్టివేయడం తగదు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పార్లమెంటు చేపట్టిన సవరణ చెల్లుతుంది.
– మెజార్టీ తీర్పులో జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ త్రివేదీ, జస్టిస్ పార్దీవాలా
రాజ్యాంగ ఉల్లంఘనే
ఈడబ్ల్యూఎస్ కోటా కోసం చేసిన సవరణ రాజ్యాంగ విరుద్ధం. కనుక కొట్టివేయడమైనది. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సవరణ విరుద్ధంగా ఉంది. కేంద్రం ప్రయోజనాలుగా చూపిస్తున్నది ఫ్రీపాస్గానే అర్థం చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఆర్థిక బలహీన వర్గాల కోటా నుంచి మినహాయించడం సమానత్వ సూత్రానికి విరుద్ధం. ఆర్థికంగా వెనుకబడినవారిలో ఆ వర్గాలవారే ఎక్కువ. తీవ్రమైన అన్యాయాలకు గురైన సమూహాలు, కులాలకు సామాజిక న్యాయం చేసేందుకు తెచ్చినవే రిజర్వేషన్లు. ఆర్థిక ప్రాతిపదికను ముందుకు తెచ్చి అందులో వారు లేకుండా చేయడం అన్యాయమే. – మైనార్టీ తీర్పులో జస్టిస్ లలిత్, జస్టిస్ రవీంద్రభట్
దశాబ్దాల పోరాటానికి ఎదురుదెబ్బ
సుప్రీంకోర్టు తీర్పు.. సామాజిక న్యాయం కోసం దశాబ్దాలుగా సాగుతున్న పోరాటానికి ఎదురుదెబ్బ. దీనిపై తదుపరి నిర్ణయం తీసుకునే ముందు న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటాం.
– స్టాలిన్, తమిళనాడు సీఎం
సుప్రీం తీర్పు విచారకరం
సుప్రీం తీర్పు విచారకరం. తీర్పుపై మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. రిజర్వేషన్లు 50% దాటొద్దని గతంలో 9 మంది జడ్జీల ధర్మాసనం స్పష్టంచేసింది. అగ్రవర్ణ పేదలకు ఆర్థికపరమైన స్కీములు పెట్టి అభివృద్ధి చేయాలి తప్ప రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకం.
– బీసీ సంక్షేమ సంఘం, జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
రాజ్యాంగ విరుద్ధం
సుప్రీం కోర్టు తీర్పు విచారకరం. ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకే విరుద్ధం. వెంటనే ఆ తీర్పుపై పునర్విచారణ చేయాలి. త్వరలోనే రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తాం.
– బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్