న్యూఢిల్లీ: తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి నోటీసులు జారీచేసింది. రెండు వారాల్లో స్పందన తెలియజేయాలని శుక్రవారం ఆదేశించింది.
తీవ్ర నేరాభియోగాలు ఎదుర్కొంటున్న అభ్యర్థులను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకొనేలా కేంద్రం, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. సుప్రీంకోర్టు గత ఆదేశాలు, లా కమిషన్ సిఫార్సులు ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. 2019 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన 539 మందిలో 233 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించారని ప్రస్తావించారు.