న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకం విషయంలో ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్(Kejriwal), లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(LG Saxena) మధ్య చాన్నాళ్ల నుంచి ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఓ పిటీషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు(Supreme court) ఆ ఇద్దరికీ సూచన చేసింది. రాజకీయాలను పక్కనపెట్టి, కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని కోర్టు తన ఆదేశాల్లో తెలిపింది. బ్యూరోక్రాట్ల నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ను ఆమ్ ఆద్మీ సర్కార్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్(DERC)కు అధిపతి లేరని వేసిన పిటీషన్ను ఇవాళ సుప్రీం విచారించింది. సీఎం కేజ్రీ, ఎల్జీ సక్సేనా కూర్చుని మాట్లాడుకుంటే, డీఈఆర్సీకి ఓ వ్యక్తిని నియమించవచ్చు అని కోర్టు చెప్పింది.
కోర్టు ఇచ్చిన సూచన తమకు సమ్మతంగానే ఉన్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే తెలిపారు. డీఈఆర్సీ చైర్పర్సన్ను నియమించడమే తమ ఉద్దేశమని, కానీ ఆ సమస్య లోతుల్లోకి వెళ్లలేమని, ఏదేమైనా సీఎం, ఎల్జీలు కుర్చుని ఈ సమస్యను పరిష్కరించాలని కోర్టు పేర్కొన్నది. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదించారు.
అయితే ఢిల్లీలో నియామకాల విషయంలో తెచ్చిన ఆర్డినెన్స్కు సంబంధించిన బిల్లును వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు తన అఫిడవిట్లో సొసిలిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. మళ్లీ గురువారం ఈ కేసులో తదుపరి విచారణ చేపట్టనున్నారు.