న్యూఢిల్లీ, జూలై 1: మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆమె వ్యాఖ్యల వల్ల దేశభద్రతకే ముప్పు వాటిల్లిందని మండిపడింది. టీవీ చర్చలో అహంకారంతో ఆమె చేసిన వ్యాఖ్యల తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన అన్ని ఘటనలకు నూపుర్ శర్మయే ఏకైక బాధ్యురాలని స్పష్టంచేసింది. నోటిదురుసుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. దేశంలో మంటలు రేపినందుకు.. టీవీ ముందుకు వచ్చి జాతి ప్రజలకు ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. అధికార పార్టీ నేతలైతే అరెస్టులు చేయరా? అని ఢిల్లీ పోలీసులను ప్రశ్నించింది. మహమ్మద్ ప్రవక్తపై ఓ జాతీయ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో నూపుర్ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగాయి.
అంతర్జాతీయంగా పలు దేశాలు నుపూర్ వ్యాఖ్యలను ఖండించాయి. ఆయా దేశాల్లోని భారత రాయబారులకు నోటీసులు పంపాయి. ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యలకు పూనుకొన్న బీజేపీ.. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మరోవైపు, నూపుర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దేశంలో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. అయితే, తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నదని, తనపై వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసులన్నింటినీ ఢిల్లీకి బదిలీ చేయాలంటూ నూపుర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన వెకేషన్ బెంచ్ శుక్రవారం విచారణ జరిపి.. పిటిషన్ను తోసిపుచ్చింది. కాగా, నూపుర్పై సుప్రీం వెకేషన్ బెంచ్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఓ పిటిషన్ దాఖలైంది. ఢిల్లీకి చెందిన హక్కుల కార్యకర్త అజయ్ గౌతమ్ ఈ పిటిషన్ వేశారు.
కోర్టు కీలక వ్యాఖ్యలు..
యాంకర్పై కూడా కేసు నమోదు చేయాల్సింది
డిబేట్లో భాగంగా టీవీ యాంకర్ అడిగిన ప్రశ్నకు మాత్రమే నూపుర్ సమాధానం చెప్పారని ఆమె తరఫు న్యాయవాది మణీందర్ సింగ్ ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. అయితే, తాను ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణమైన ఆ యాంకర్పై నూపుర్ కేసు పెట్టాల్సిందని న్యాయస్థానం సూచించింది. తన కేసులన్నింటినీ ఢిల్లీకి బదిలీచేయాలన్న నూపుర్ అభ్యర్థననూ తోసిపుచ్చిన ధర్మాసనం.. పిటిషన్ను వెనక్కితీసుకోవాలని ఆదేశించింది.
బీజేపీ సిగ్గుతో ఉరేసుకోవావి
విధ్వంసకర విభజన భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి సుప్రీం తీర్పు మరింత బలాన్ని ఇచ్చింది. కోర్టు వ్యాఖ్యలతో బీజేపీ ఇప్పటికైనా సిగ్గుతో ఉరేసుకోవాలి.
– కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్
వెంటనే అరెస్టు చేయాలి
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నూపుర్ను వెంటనే అరెస్టు చేసి చట్టబద్ధమైన పాలన సాగించాలి.
– ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ
క్షమాపణలు చెప్పాలి
బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడకూడదు. సామరస్యంతో జీవిస్తున్న ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే ఇలాంటి మాటలు తగవు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంలోని బీజేపీదే. నూపుర్ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.
– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం