న్యూఢిల్లీ, జూలై 5 : దావాకు సంబంధించి ఏదైనా రాజీ ఒప్పందాలు చేసుకుంటే అవి తప్పనిసరిగా లిఖితపూర్వకంగా ఉండాలని, సంబంధిత పక్షాలు లేదా వారి అధికార ప్రతినిధుల సంతకాలను కలిగి ఉండాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలా కాని పక్షంలో దానిని చట్టబద్ధమైనదిగా పరిగణించ లేమని తెలిపింది. కోర్టులో దావా వేసిన వారి హక్కుల రక్షణను బలోపేతం చేసేలా సుప్రీం ఒక కీలక తీర్పును వెలువరించింది. సివిల్ ప్రొసీజర్ కోడ్లోని నిబంధన ప్రకారం తప్పనిసరిగా ఉండాల్సిన నిబంధనలు పాటించని కాంప్రమైజ్ డిక్రీ చెల్లదని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది.
ఇండియన్ కాంట్రాక్టు చట్టం, 1872 ప్రకారం చెల్లని, రద్దుచేయదగిన ఒప్పందాన్ని అమలు చేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలాగే ఆ రాజీ చట్టబద్ధంగా, స్వచ్ఛందంగా, పూర్తి అవగాహనతో కుదిరిందని నిర్ధారించుకోవడానికి న్యాయస్థానం తన న్యాయపరమైన విచక్షణను ఉపయోగించాలని స్పష్టం చేసింది. 1989 నాటి ఆస్తి విభజన దావాలో 1994లో కుదిరిన రాజీ ఉత్తర్వును 25 ఏండ్ల తర్వాత సవాలు చేయడానికి ప్రతివాది చట్టపరమైన వారసులకు అనుమతి ఇస్తూ కోర్టు ఈ తీర్పు చెప్పింది.