న్యూఢిల్లీ: హైదరాబాద్కు చెందిన గే జంట వేసిన ఓ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వలింగ సంపర్కుల వివాహాలపై తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని కేంద్రానికి సుప్రీం నోటీసులు ఇచ్చింది. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణికి కూడా ఆ నోటీసులు వెళ్లాయి. ప్రత్యేక వివాహం చట్టం కింద సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకున్న జంటలకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని కొన్ని జంటలు సుప్రీంలో పిటిషన్ వేశాయి. హైదరాబాద్లో జీవిస్తున్న సుప్రియో చక్రబర్తి, అభయ్ దంగ్ అనే గే జంట కూడా పిటిసన్ వేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం ఆ పిటిషన్లపై ఇవాళ విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు అటార్నీ జనరల్ కూడా ఈ అంశంపై వివరణ ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకున్న హక్కు ఎల్జీబీటీక్యూ వర్గానికి వర్తించేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జంట తమ పిటిషన్లో కోరింది.
సుప్రియో, అభయ్లు గత పదేళ్ల నుంచి కలిసి ఉంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో వాళ్లకు వైరస్ సంక్రమించింది. ఆ వైరస్ నుంచి కోలుకున్న ఇద్దరూ 2021 డిసెంబర్లో వేడుక నిర్వహించారు. ఆ సంబరాలకు పేరెంట్స్, ఫ్యామిలీతో పాటు మిత్రులు హాజరయ్యారు.
పర్త్ పిరోజ్ మెహరోత్రా, ఉదయ్ రాజ్ అనే మరో జంట రెండవ పిటిషన్ వేసింది. సేమ్ సెక్స్ మ్యారేజ్ను గుర్తించకపోవడం అంటే అది సమానత్వ హక్కును ఉల్లంఘించడమే అవుతుందన్నారు.