Bhima Koregaon| న్యూఢిల్లీ: భీమా కోరెగావ్ కేసులో సామాజిక కార్యకర్తలు వెర్నాన్ గొన్సాల్వెస్, అరుణ్ ఫెరెరాకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. వారికి శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మహారాష్ట్రను వీడి వెళ్లరాదని, పాస్పోర్టులను పోలీసుల వద్ద సరండర్ చేయాలని ఆదేశించింది. తమ చిరునామాను ఎన్ఐఏకు తెలియజేయాలని స్పష్టంచేసింది. హింసను ప్రేరేపించారనే అభియోగాలపై యూఏపీఏ చట్టం కింద 2018 ఆగస్టులో గొన్సాల్వెస్, ఫెరెరాను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి వారు ముంబైలోని తలోజా జైలులో ఉన్నారు. వారిద్దరి బెయిల్ పిటిషన్ను 2021 డిసెంబర్లో బాంబే హైకోర్టు తిరస్కరించింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఐదేండ్లుగా వారు కస్టడీలో ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం తాజాగా వారికి బెయిల్ మంజూరు చేసింది. వారిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నప్పటికీ, వారిని జైలులోనే ఉంచేందుకు అదొక్కటే ప్రాతిపాదిక కాదని కోర్టు అభిప్రాయపడింది.
బీమా కోరెగావ్ యుద్ధం శత వార్షికాన్ని పురస్కరించుకొని 2017 డిసెంబర్లో పుణేలో ఎల్గార్ పరిషద్ కాన్క్లేవ్ నిర్వహించారు. దీనికి మావోయిస్టులు నిధులు సమకూర్చారని పోలీసులు కేసు నమోదు చేశారు. కాన్క్లేవ్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, దీంతో మరుసటి రోజు బీమా కోరెగావ్ యుద్ధ స్మారకం వద్ద హింస చెలరేగిందని పోలీసులు ఆరోపించారు. ఈ కేసులో ఇది వరకే వరవరరావుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో నిందితుడు గౌతమ్ నవలఖాను గృహనిర్బంధంలో ఉంచేందుకు అనుమతించింది