న్యూఢిల్లీ, నవంబర్ 11: మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుగురు దోషులను విడుదల చేయటానికి అంగీకరించింది. తమను ముందస్తు విడుదల చేయాలని నళిని శ్రీహరన్ సహా ఆరుగురు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో 31 ఏండ్ల పాటు శిక్ష అనుభవించిన ఏజీ పెరరివలన్ విడుదలకు సుప్రీంకోర్టు మే 18న ఉత్తర్వులు జారీ చేసింది. అధికరణ 142 కింద అసాధారణ అధికారాలను ఉపయోగించుకొని సుప్రీం ఈ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును గుర్తు చేస్తూ.. మిగతా దోషులకూ ఇదే తీర్పు వర్తిస్తుందని న్యాయమూర్తులు తెలిపారు. నళినితో పాటు రవిచంద్రన్, రాబర్ట్ పయాస్, జయకుమార్, మురుగన్, శాంతన్ను విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దోషుల అభ్యర్థనపై ఇంతకుముందే తమిళనాడు ప్రభుత్వానికి, కేంద్రానికి సుప్రీం నోటీసులు జారీ చేసి, వివరణ కోరింది.
వారి నుంచి, సోనియా గాంధీ కుటుంబం నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకపోవటంతో విడుదలకు సుప్రీం సమ్మతించింది. ప్రస్తుతం ఈ దోషులంతా తమిళనాడులోని వేలూరు జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
సుప్రీం తీర్పు ఆమోదయోగ్యం కాదు రాజీవ్గాంధీ హంతకులను విడుదల చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ పేర్కొన్నది. ఆ పార్టీ నేత జైరాం రమేశ్ మాట్లాడుతూ.. తీర్పులో భారతీయ స్ఫూర్తికి అనుగుణంగా సుప్రీం ప్రవర్తించకపోవటం దురదృష్టకరమన్నారు. ఈ తీర్పు విమర్శల నుంచి తప్పించుకోలేనిదని అన్నారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. ‘ఈ కేసులో కేంద్రం అభిప్రాయంతో మేం ఏకీభవించం. సోనియాగాంధీ ఉన్నత స్థాయి వ్యక్తి. ఆమె అభిప్రాయాలు ఆమెవి. సోనియా అంటే మాకు చాలా గౌరవం. ఈ విషయంలో మాత్రం పార్టీ ఆమెతో ఏకీభవించదు’ అని పేర్కొన్నారు.
రాజీవ్ గాంధీ హత్య కేసు వివరాలివీ..
మే 21, 1991: తమిళనాడులోని శ్రీపెరుంబదూర్లో ఎన్నికల ర్యాలీలో చోటుచేసుకున్న ఆత్మాహుతి దాడిలో రాజీవ్ మృతి
మే 24, 1991: సీబీఐకి కేసు
జనవరి 28, 1998: 26 మందికి టాడా కోర్టు ఉరి శిక్ష
ఏప్రిల్, 2000: తమిళనాడు ప్రభుత్వ సిఫారసు మేరకు నళిని శ్రీహరన్ శిక్షను తగ్గింపు
ఆగస్టు 12, 2011: రాష్ట్రపతికి పెరరివలన్ క్షమాభిక్ష పిటిషన్
మే 1, 2012: సుప్రీంకోర్టుకు కేసు బదిలీ
ఫిబ్రవరి 18, 2014: పెరరివలన్, శాంతన్, మురుగన్ల ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్పు
డిసెంబర్ 30, 2015: రెమిషన్ కోసం పెరరివలన్ పిటిషన్
మే 18, 2022: పెరరివలన్ను విడుదలకు సుప్రీం కోర్టు ఆదేశం
ఆగస్టు 12, 2022: తమనూ విడుదల చేయాలని నళిని శ్రీహరన్, రవిచంద్రన్ అభ్యర్థన
నవంబర్ 11, 2022: ఆరుగురు దోషుల విడుదలకు సుప్రీం ఓకే