న్యూఢిల్లీ, మార్చి 13 : అన్ని రంగాల్లో పనిచేసే మహిళలకు వేతనంతో కూడిన నెలసరి సెలవు కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. అన్ని భాగస్వామ్య పక్షాలతో సంప్రదించి నెలసరి సెలవు విధానాన్ని రూపొందించడానికి పిటిషనర్ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. చట్టం ద్వారా నెలసరి సెలవులను తప్పనిసరి చేయడం వల్ల మహిళల ఉపాధిపై ఊహించని పరిణామాలు సంభవించ వచ్చని విచారణ సందర్భంగా కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది మహిళలను యాజమాన్యాలు నియమించుకోకుండా నిరుత్సాహపరచవచ్చని, తద్వారా వారు శ్రామికశక్తిలో పాల్గొనడంలో ప్రతికూల ప్రభావం చూపగలదని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చితో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. పిటిషనర్ శైలేంద్ర మణి త్రిపాఠీ అర్హతలను ప్రశ్నించిన ధర్మాసనం ఈ విషయమై ఏ మహిళ కూడా కోర్టును ఆశ్రయించలేదని స్పష్టం చేసింది.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎంఆర్ షంసద్ వాదనలు వినిపిస్తూ కేవలం కర్ణాటక ప్రభుత్వం మాత్రమే నెలసరి సెలవును అనుమతించేందుకు విధాన నిర్ణయం తీసుకుందని తెలిపారు. నెలసరి సెలవులు ప్రతికూల ఫలితాలను కలిగిస్తాయని సీజేఐ అభిప్రాయపడ్డారు. తాము పురుషులతో సమానంగా లేమన్న భావన మహిళల్లో కలిగిస్తాయని, ఒక నిర్దిష్ట సమయంలో పురుషులతో సమానంగా మహిళలు పనిచేయలేరన్న ఒక రకమైన అభిప్రాయాన్ని సృష్టించడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుందని సీజేఐ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు.