న్యూఢిల్లీ, మార్చి 27: తనపై లైంగికదాడికి పాల్పడిన దోషులను విడుదల చేయడాన్ని సవాల్చేస్తూ బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం కేంద్రం, గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. బిల్కిస్ బానో పిటిషన్పై స్పందించాలని ఆదేశించింది. రెండు ప్రభుత్వాలతో పాటు 11 మంది దోషులకు కూడా నోటీసులు ఇచ్చింది. రెమిషన్ మంజూరుకు సంబంధించిన పత్రాలతో విచారణకు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది.
ఇందులో చాలా సమస్యలు ఉన్నాయని, వివరంగా విచారించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొంటూ.. జస్టిస్ కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం పిటిషన్పై తదుపరి విచారణను ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా వేసింది. కాగా, బిల్కిస్పై దారుణాన్ని అత్యంత భయానకమైనదిగా పేర్కొన్న ధర్మాసనం.. ఈ కేసులో భావోద్వేగాలకు తావు ఉండదని, చట్టం ప్రకారమే వెళ్తామని తెలిపింది. 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై గ్యాంగ్రేప్ ఘటనలో కోర్టు 11 మందిని దోషులుగా తేల్చింది. అయితే గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం వీరిని గత ఏడాది ఆగస్టులో రెమిషన్పై విడుదల చేసింది.