సిమ్లా: హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత వేటు ఉత్తర్వులపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం హిమాచల్ అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా కార్యాలయానికి సోమవారం నోటీస్ జారీ చేసింది. ఈ పిటిషన్పై నాలుగు వారాల్లో ప్రతిస్పందించాలని కోరింది.
కాగా, కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తీర్పు పెండింగ్లో ఉన్నందున అసెంబ్లీలో ఓటు వేయడానికి లేదా అసెంబ్లీ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వారికి అనుమతి లేదని సుప్రీంకోర్టు తెలిపింది. అలాగే ఖాళీగా ప్రకటించిన ఆరు స్థానాలకు ఉపఎన్నికల కోసం ఈసీ నోటిఫై చేయడాన్ని పెండింగ్లో ఉంచాలా వద్దా అన్నది పరిశీలిస్తామని కోర్టు పేర్కొంది. రెబల్ ఎమ్మెల్యేలు వారం రోజుల్లోగా తమ వాదనలు దాఖలు చేయాలని కోరింది. తదుపరి విచారణ మే 6కు వాయిదా వేసింది.
మరోవైపు ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలైన సుధీర్ శర్మ, రవి ఠాకూర్, రాజిందర్ రాణా, ఇందర్ దత్ లఖన్పాల్, చెతన్య శర్మ, దేవిందర్ కుమార్ భుట్టో కాంగ్రెస్ పార్టీ విప్ను ధిక్కరించారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఫిబ్రవరి 29న ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 68 నుంచి 62కు తగ్గింది. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య కూడా 40 నుంచి 34కు తగ్గింది. కాగా, లోక్సభ స్థానాలతోపాటు ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ కూడా ప్రకటించింది.