న్యూఢిల్లీ: తమిళనాడు మంత్రి, డీఎంకే నేత వీ సెంథిల్ బాలాజీకి మెడికల్ గ్రౌండ్పై బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు(Supreme Court) నిరాకరించింది. క్యాష్ ఫర్ జాబ్స్ కు సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో మంత్రి బాలాజీని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బేలా ఎం త్రివేది, సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఇవాళ తన ఆదేశాలు జారీ చేసింది. బాలాజీ ఆరోగ్యం గురించి గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకున్నామని, ఆయన ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదని గ్రహించామని, మెడికల్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. గూగుల్ చెక్ చేశానని, దాన్ని క్యూర్ చేయలేమని ఉందని జస్టిస్ త్రివేది తెలిపారు. అయితే రెగ్యులర్ బెయిల్ కోసం మంత్రి బాలాజీ దరఖాస్తు చేసుకోవచ్చు అని కోర్టు చెప్పింది.
తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలో బస్సు కండెక్టర్ల నియామకాల్లో అక్రమాలు జరిగిన కేసులో మంత్రి బాలాజీని జూన్ 14వ తేదీన అరెస్టు చేశారు. డ్రైవర్లు, జూనియర్ ఇంజినీర్ల రిక్రూట్మెంట్లో అవకతవకలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. 2011 నుంచి 2015 మధ్య అన్నాడీఎంకే అధికారంలో ఉన్న సమయంలో ట్రాన్స్పోర్టు మంత్రిగా ఉన్న సెంథిల్ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈడీ అరెస్టు చేసిన తర్వాత ఆయన తన ఛాతిలో నొప్పి ఉన్నట్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన్ను రాష్ట్ర దావఖానాలో చేర్పించారు. ఆ తర్వాత ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత మళ్లీ జైలుకు పంపించారు. మెడికల్ గ్రౌండ్స్పై బెయిల్ ఇవ్వాలని పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.
మెడికల్ గ్రౌండ్పై బెయిల్ ఇవ్వాలన్న అంశంపై కోర్టులో ఆసక్తికర వాదన జరిగింది. సెంథిల్కు బైపాస్ జరిగినట్లు సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్గీ బెంచ్కు తెలిపారు. అందుకే ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే ఆ సర్జరీ సీరియస్ కాదు అని కోర్టు స్పందించింది. కానీ ఆ సర్జరీ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని, ప్లీజ్ బెయిల్ ఇవ్వాలని రోహత్గీ మళ్లీ కోరారు. ఆ వాదనకు కోర్టు స్పందిస్తూ.. గూగుల్లో చెక్ చేశామని, దీన్ని నయం చేయడం వీలవుతుందని పేర్కొన్నట్లు జస్టిస్ త్రివేది తెలిపారు.
క్రానిక్ స్ట్రోక్ వస్తుందన్న అంశంపై గూగుల్ సమాచారాన్ని మీ ముందు ఉంచినట్లు మళ్లీ రోహత్గీ చెప్పారు. అయినా ఎట్టి పరిస్థితుల్లో సెంథిల్కు బెయిల్ ఇచ్చేది లేదనని కోర్టు చెప్పింది. ఈ కేసులో విచారణ జరుగుతోందని కోర్టు తెలిపింది. మంత్రి బాలాజీ బలహీనంగా ఉన్నారని, ఆయనకు బైస్ పాస్ జరిగిందని రోహత్గీ మరోసారి తెలిపాడు. ఈ రోజుల్లో అపెండిక్స్ సర్జరీల్లా బైపాస్ సర్జరీలు జరుగుతున్నాయని కోర్టు తెలిపింది. మెడికల్ బెయిల్ ఇవ్వడానికి సంతృప్తికర సమాధానం లేదని, అందుకే రెగ్యులర్ బెయిల్ కోసం మంజూరీ చేసుకోవాలని కోర్టు సూచించింది.