న్యూఢిల్లీ, జూలై 13: ఉత్తరప్రదేశ్లోని మూడు మందిర్-మసీదు వివాదాల విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తామన్న సుప్రీంకోర్టు ప్రతిపాదనను హిందూ, ముస్లిం పక్షాలు రెండూ తిరస్కరించాయి. వారణాసిలో జ్ఞానవాపి మసీదు, మథురలోని శ్రీకృష్ణజన్మభూమి షాహీ ఈద్గా, సంభల్లో షాహీ జామా మసీదు వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాల విషయంలో శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు, ఉభయ పక్షాల అంగీకారాన్ని కోరుతూ.. సుప్రీంకోర్టు ‘సమాధాన్ సమారోహ్ 2026’ కార్యక్రమంలో భాగంగా మధ్యవర్తిత్వం వహిస్తామని ప్రతిపాదిస్తూ ఒక లేఖ పంపినట్టు బార్ అండ్ బెంచ్ వెల్లడించింది.
కాగా ఇందుకు ఉభయపక్షాలు అంగీకారం తెలుపలేదు. ఈ వివాదాలకు పరిష్కారం కోర్టు విచారణ ద్వారానే లభించాలని రెండు పక్షాలు స్పష్టం చేసినట్టు తెలిసింది. దీర్ఘకాల న్యాయవివాదాల పరిష్కారానికి సుప్రీంకోర్టు ఆగస్టు 21 నుంచి 23 వరకు సమాధాన్ సమారోహ్ కింద ప్రత్యేక లోక్అదాలత్ నిర్వహిస్తున్నది. ఈ సమయంలోనే మూడు వివాదాలకు పరిష్కారం కనుగొనాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించినట్టు బార్, బెంచ్ పేర్కొన్నాయి.