న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: తమిళనాడు సీఎం స్టాలిన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ బెయిల్ను సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేసేవారందరినీ జైల్లో వేస్తారా అని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. యూట్యూబర్ దురైమురుగన్ సత్తై తనకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, ఉజ్జల్ భుయాన్తో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీని ఉద్దేశించి ‘ఇలా ఎన్నికల ముందు ప్రతి ఒక్కరినీ కటకటాల వెనక్కి నెడితే.. ఎంత మంది జైల్లో ఉంటారో ఊహించుకోండి’ అని జస్టిస్ ఓకా వ్యాఖ్యానించారు. బెయిల్ మీద ఉన్నప్పుడు సత్తై నిందాపూర్వక విమర్శలు చేయకుండా ఉండేలా చూడాలన్న విజ్ఞప్తినీ కోర్టు తిరస్కరించింది.
ఏ ప్రకటన నిందాపూర్వకమైనది, కానిది ఎవరు నిర్ణయిస్తారని రోహత్గీని జస్టిక్ ఓకా ప్రశ్నించారు. తనకు మంజూరైన బెయిల్ను మద్రాస్ హైకోర్టు రద్దు చేయడంతో సత్తై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన గత రెండున్నరేండ్ల నుంచి బెయిల్పై ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్ జరగడానికి కొన్ని రోజుల ముందు సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పును ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.