Fact Check | హైదరాబాద్, మార్చి 21(నమస్తే తెలంగాణ): పీఐబీ ఫ్యాక్ట్చెక్ యూనిట్ ఏర్పాటుకు బుధవారం కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్పై గురువారం సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన అంశమని అభిప్రాయపడ్డ అత్యున్నత ధర్మాసనం.. ఈ అంశంపై బాంబే హైకోర్టు తుదితీర్పు వెలువరించేంత వరకూ స్టే ఆదేశాలు కొనసాగుతాయని వెల్లడించింది. నకిలీ వార్తలను, సమాచారాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఆధ్వర్యంలో ‘ఫ్యాక్ట్చెక్’ యూనిట్ను తీసుకొస్తున్నట్టు కేంద్రంలోని బీజేపీ సర్కారు కిందటేడాది ఏప్రిల్లో పేర్కొంది. ఇందుకోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021కు సవరణలు చేసింది. అయితే, ఈ కొత్త నిబంధనలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే ఐటీ నిబంధనల చెల్లుబాటును సవాల్ చేస్తూ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మార్చి 11న విచారణ జరిపిన హైకోర్టు.. ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటీషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కేంద్రం తాజా ఆదేశాల ప్రకారం.. ‘ఫ్యాక్ట్ చెక్ యూనిట్’ దృష్టిలో తప్పుగా ఉన్న కంటెంట్ను తమ వేదికల నుంచి సోషల్ మీడియా సంస్థలు తొలగించాలి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఆ కంటెంట్కు సంబంధించిన లింకులను బ్లాక్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ కొత్త నిబంధనలు వాక్ స్వాతంత్య్రాన్ని హరించేలా, ఆన్లైన్ ప్రసంగాలను అడ్డుకొనే విధంగా ఉన్నాయని ప్రతిపక్షాలు, నిపుణులు విమర్శిస్తున్నారు. ప్రత్యేకించి న్యూస్ పబ్లిషర్లు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఢిల్లీకి చెందిన డిజిటల్ రైట్స్ గ్రూపు ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ పేర్కొన్నది. ఫేక్ న్యూస్ అవునా కాదా అనేది నిర్ణయించడంపై ప్రభుత్వానిదే తుది నిర్ణయం అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. తాజా నిబంధనలతో పీఐబీకి అపరిమిత అధికారులు లభిస్తాయని పేర్కొంటున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి తప్పుడు సమాచారం ఆన్లైన్లో ప్రచారంలో ఉంటే వాటిని ‘ఫ్యాక్ట్ చెక్ యూనిట్’ విభాగం పసిగట్టి సంబంధిత వేదికలకు సమాచారం ఇస్తుంది. ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఫ్లాగ్ చేసిన వార్తలను ఆయా మీడియా సంస్థలు తప్పనిసరిగా తొలగించాల్సి ఉంటుంది. అలా చేయని సంస్థలు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.