న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో వివాదాస్పదంగా మారిన నామినేటెడ్ సభ్యుల ఎన్నికపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ మంత్రివర్గం సలహా, సాయం లేకుండా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు 10 మంది సభ్యులను లెఫ్ట్నెంట్ గవర్నర్ ఎలా నామినేట్ చేశారని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై 10 రోజుల్లోగా సమాధానమివ్వాలని ఎల్జీ కార్యాలయాన్ని ఆదేశించింది. 10 మంది నామినేటెడ్ సభ్యుల ఎంపికను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఢిల్లీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా, మార్చి 29న ఎల్జీకి నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో పిటిషన్పై విచారణ చేపడతామని చెప్తూ, సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, ఆర్టికల్ 239ఏఏపై సుప్రీం తీర్పును అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఢిల్లీ ఎల్జీ తరఫు న్యాయవాది) తప్పుగా అన్వయించారని చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఢిల్లీ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి, అధికారిక ఫైల్స్ను నేరుగా ఎల్జీకి పంపుతున్నారని సింఘ్వీ సుప్రీం దృష్టికి తెచ్చారు. ‘మేం ప్రతిసారీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంటే, వారు అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు’ అని అన్నారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా తీర్పును నీరుగారుస్తూ, నామినేటెడ్ సభ్యుల ఎంపిక జరిగిందని, ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని సింఘ్వీ వాదనలు వినిపించారు.