న్యూఢిల్లీ, నవంబర్ 28: న్యాయమూర్తుల నియామకంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వం గీత దాటుతున్నదని.. అది తిరిగి వెనక్కి రాలేని స్థితి అని వ్యాఖ్యానించింది. చట్టం ఉన్నంత వరకూ దానిని అమలు చేయాల్సిందేనని స్పష్టంచేసింది. కొలీజియం చేసిన సిఫారసులపై కేంద్రం తన సమ్మతిని తెలియజేయాల్సిందేనని లేదా తామే ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం సిఫారసు చేసిన పేర్లను తొక్కి పెట్టడంపై ధర్మాసనం అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణిని మందలించింది. ‘ఇలాగైతే న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? మా ఆవేదనను ఇదివరకే వ్యక్తంచేశాం’ అని వ్యాఖ్యానించింది.
తమ అభ్యంతరం ఏమిటో తెలుపకుండా కొలీజియం సిఫారసు పేర్లను కేంద్రం తొక్కిపెట్టరాదని స్పష్టంచేసింది. ‘ఒక పేరును కొలీజియం రెండోసారి కూడా సిఫారసు చేసిందంటే.. ఇక ఆ అధ్యాయం ముగిసినట్టే. ప్రభుత్వం ఆమోదించాల్సిందే. రెండు నెలలుగా పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. ఈ సమస్యను దయచేసి పరిష్కరించండి.. మేమే న్యాయపరమైన నిర్ణయం తీసుకొనే పరిస్థితికి నెట్టవద్దు’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. న్యాయమూర్తుల నియామకం విషయంలో సుప్రీం నిర్దిష్టమైన గడువు విధించినప్పటికీ కేంద్రం ‘ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నది’ అని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
వ్యవస్థను ఆటంకపరుస్తున్నారు
న్యాయమూర్తుల నియామక ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టుకు చెందిన త్రిసభ్య ధర్మాసనం నిర్దిష్ట గడువును విధించిందని, దానిని అమలు చేయాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘కేంద్రం అలా కొన్ని పేర్లను తొక్కిపెట్టకూడదు. అది మొత్తం వ్యవస్థను ఆటంకపరుస్తుంది. కొన్నిసార్లు కొన్ని పేర్లను ఎంపిక చేస్తారు. మిగిలినవి తొక్కి పెడతారు. దీనివల్ల సీనియారిటీ ప్రభావితమవుతుంది’ అని జస్టిస్ కౌల్ అన్నారు. సుప్రీంకోర్టులో రెండో టాప్ సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ కౌల్ కొలీజియంలో కూడా సభ్యుడు. ‘కొన్ని పేర్లు ఏడాదిన్నరగా పెండింగ్లో పెట్టారు. కొన్ని సిఫారసులకు నిర్దిష్ట గడువు దాటిపోయింది. కొలీజియం సిఫారసు చేసిన ఒక లాయర్ మృతి చెందారు. మరొకరు తన పేరును ఉపసంహరించుకొన్నారు’ అని తెలిపారు. కేంద్రం తెచ్చిన నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్జేఏసీ) చట్టం ఆమోదం పొందకపోవడం నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాదా? అని ప్రశ్నించారు. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కేంద్రం తెచ్చిన ఎన్జేఏసీని సుప్రీం 2015లో కొట్టివేసింది. దీంతో కొలీజియం వ్యవస్థ మళ్లీ అమలులోకి వచ్చింది.
కొలీజియం సిఫారసులు వెనక్కి!
హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన 20 ఫైళ్లను కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టు కొలీజియంకు తిప్పి పంపింది. ఆ ఫైళ్లను పునఃపరిశీలించాలని కోరింది. ఈ జాబితాలో తన గే స్టేటస్ గురించి నిక్కచ్చిగా మాట్లాడిన న్యాయవాది సౌరభ్ కిర్పాల్ పేరు కూడా ఉన్నదని సంబంధిత వర్గాలు సోమవారం వెల్లడించాయి.
కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై అసంతృప్తి
కొలీజియం వ్యవస్థ రాజ్యాంగానికి ‘పరాయి జీవి’ అన్న కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు వ్యాఖ్యపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని పేర్కొంది. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్మెహతా స్పందిస్తూ మీడియాలో కొన్ని వార్తలు తప్పుగా వస్తున్నాయని చెప్పారు. పత్రికా వార్తలను తాను పట్టించుకోవడం లేదని, కానీ ఒక ఉన్నతస్థాయి వ్యక్తి ఇంటర్వ్యూలో ఆ వ్యాఖ్య చేశారని అంటూ.. ‘నేను ఏమీ అనటం లేదు.. కానీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడితే.. మేము తప్పకుండా నిర్ణయం తీసుకొని తీరుతాం’ అని జస్టిస్ కౌల్ స్పష్టం చేశారు. కేసు తదుపరి విచారణను డిసెంబర్ ఎనిమిదికి వాయిదా వేశారు.