న్యూఢిల్లీ: చీఫ్ ఎలక్షన్ కమీషనర్తో పాటు ఎన్నికల సంఘం అధికారుల నియామకానికి సంబంధించి గత ఏడాది డిసెంబర్లో కేంద్రం కొత్త చట్టాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వేసిన దావాపై ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ చేపట్టారు. కొత్త చట్టం అమలుపై స్టే ఇవ్వడం లేదని సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది. కానీ ఆ చట్టానికి ఎంత వరకు చెల్లుబాటు ఉందో అంశాన్ని తెలుసుకునేందుకు కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తున్నట్లు ధర్మాసనం చెప్పింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. మేం కేవలం నోటీసు మాత్రమే ఇస్తం, కానీ ఆ చట్టంపై స్టే ఇవ్వడం లేదని ధర్మాసనం పేర్కొన్నది. పిటీషనర్ జయా థాకూర్ తరపున సీనియర్ న్యాయవాది వికాశ్ సింగ్ వాదించారు.