న్యూఢిల్లీ, జూన్ 16: ఉత్తరప్రదేశ్లో వివిధ కేసుల్లో నిందితుల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేయడంపై సుప్రీంకోర్టు గురువారం విచారణ ప్రారంభించింది. చట్టాల్లోని నిబంధనలకు విరుద్ధంగా ఇండ్ల కూల్చివేతలు తగదని హెచ్చరించింది. అధికారులు చట్టాల ప్రకారమే నడుచుకోవాలని, కక్ష సాధింపు చర్యలు వద్దని సూచించింది. ఇండ్ల కూల్చివేతలపై తాము స్టే విధించలేమని తెలిపింది. అయితే, అధికారుల చర్యలు ‘చట్టం నిర్దేశించిన పద్ధతిలోనే ఉండాలి’ అని స్పష్టం చేసింది.
ప్రభుత్వ ప్రతీ చర్య పారదర్శకంగా ఉండాలని పేర్కొన్నది. బుల్డోజర్లలో ఇండ్ల కూల్చివేతపై వివరణ ఇవ్వడానికి జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ విక్రమ్నాథ్లతో కూడిన ధర్మాసనం యూపీ ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు మూడు రోజుల గడువు ఇచ్చింది. దేశంలో చట్టబద్ధమైన పాలన కొనసాగుతున్నదన్న విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. అప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. ‘నిందితులు కూడా ఈ సమాజంలో భాగమే. వారి భద్రతపై భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది’అని వ్యాఖ్యానించింది.
యూపీతో పాటు ఢిల్లీలోని జహంగీర్పురిలో బుల్డోజర్లతో ఇండ్లను కూల్చివేయడంపై జమాయత్ ఉలేమా-ఇ-హింద్ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ముందస్తు నోటీసులు లేకుండా ఇండ్లు కూల్చివేయవద్దని, ఈ మేరకు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. ఈ పిటిషన్లపైనే సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కాన్పూర్, ప్రయాగ్ రాజ్ మునిసిపాలిటీ అధికార యంత్రాంగం తరఫున సీనియర్ అడ్వొకేట్ హరీశ్ సాల్వే వాదించారు. జమాయల్ ఉలేమా తమ పిటిషన్లలో పేర్కొన్న మూడు సందర్భాల్లోనూ ఇండ్ల కూల్చివేతకు సంబంధించి 2020 ఆగస్టులోనే నోటీసులు ఇచ్చినట్టు కోర్టుకు తెలిపారు.