న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ మహేశ్వరి(Dinesh Maheshwari).. 23వ లా కమీషన్ చైర్పర్సన్గా నియమితులయ్యారు. లా కమీషన్ చైర్మెన్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు న్యాయవాది హితేశ్ జైన్, ప్రొఫెసర్ డీపీ వర్మ.. కమీషన్లో సభ్యులుగా నియమితులయ్యారు. ఏప్రిల్ 15, 2025 నాడు వాళ్లు ఛార్జ్ తీసుకున్నారు. ఆగస్టు 31, 2027న వాళ్ల పదవీ కాలం పూర్తి అవుతుంది. కేంద్ర న్యాయ మంత్రిత్వా శాఖ .. దినేశ్ మహేశ్వరి నియామకంపై ట్వీట్ చేసింది.
రాజస్థాన్లో సుమారు రెండు దశాబ్ధాల పాటు లాయర్గా జస్టిస్ మహేశ్వరి ప్రాక్టీసు చేశారు. ఆ తర్వాత 2004లో ఆయన రాజస్థాన్ హైకోర్టు బెంచ్కు పదోన్నత పొందారు. అలహాబాద్ హైకోర్టులో జడ్జిగా చేశారు. మేఘాలయా హైకోర్టు చీఫ్ జస్టిస్గా, కర్నాటక హైకోర్టు చీఫ్ జస్టిస్గా కూడా చేశారు. 2019 జనవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదోన్నతి పొందారు. 2023 మేలో రిటైర్ అయ్యే వరకు ఆయన సుప్రీంకోర్టులో జడ్జిగా చేశారు.
లా కమీషన్ సభ్యుడిగా నియమితులైన హితేశ్ జైన్.. పరినం లా అసోసియేట్స్లో మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్నారు. ముంబై ప్రదేశ్ బీజేపీలో వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు. రెండు దశాబ్ధాల నుంచి ఆయన లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. సివిల్, క్రిమినల్, కమర్షియల్, రాజ్యాంగ అంశాల్లో అనుభవం ఉన్నది. మహారాష్ట్ర తరపున ముంబై హైకోర్టులో, సుప్రీంకోర్టులో స్పెషల్ కౌన్సిల్గా హాజరయ్యారు.
22వ భారత లా కమీషన్లో ప్రొఫెసర్ వర్మ పూర్తి స్థాయి సభ్యుడిగా చేశారు. న్యాయ విద్య బోధనలో ఆయనకు నాలుగు దశాబ్ధాల అనుభవం ఉన్నది. పబ్లిక్ ఇంటర్నేషనల్ లా, మానవ హక్కుల చట్టాల్లో ఆయన విశేష అనుభవం ఉన్నది. నేషనల్ జుడిషియల్ అకాడమీలో 2017 నుంచి 2020 వరకు అదనపు డైరెక్టర్గా చేశారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలో లా కమీషన్ నాన్-స్టాట్యుటరీ బాడీగా పనిచేస్తుంది. దేశ చట్టాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తుంది. సవరించాల్సిన చట్టాలను, రద్దు చేయాల్సిన చట్టాల గురించి లా కమీషన్ తన నిర్ణయాలను వెల్లడిస్తుంటుంది. న్యాయం అందరికి అందే రీతిలో, న్యాయ విభాగంలో పరిపాలన సక్రమంగా సాగే రీతిలో లా కమీషన్ వ్యవహరిస్తుంది.