న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో వైద్య చికిత్సల ధరల్లో గణనీయమైన వ్యత్యాసం ఉండటంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. దవాఖానల్లో అందించే వైద్యసేవల ధరల్లో ప్రామాణికత పాటించాలని, లేదంటే సీజీహెచ్ఎస్ రేట్లను అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంచేసింది. ప్రజాజీవితంలో పారదర్శకత కోసం వెటరన్స్ ఫోరం అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ (కేంద్ర ప్రభుత్వం) రూల్స్, 2012లోని 9వ నిబంధన ప్రకారం వైద్య చికిత్స ధరలను నియంత్రించాలని పిటిషన్లో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన సేవల చార్జీలను అన్ని దవాఖానాల్లో స్థానిక భాషలతో పాటు ఇంగ్లిష్లో కూడా ప్రదర్శించాలన్న నిబంధన ఎప్పటి నుంచో ఉన్నది.
దీన్ని అమలులో కేంద్రం వైఫల్యాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి, కేంద్రం నిర్ణయించిన మేరకు ప్రతి చికిత్స ధర ఉండాలని స్పష్టంచేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కోరుతూ ఎన్నో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన సుప్రీం పౌరుల ప్రాథమిక హక్కు అయిన ‘అందరికీ అందుబాటు ధరలో వైద్యాన్ని’ అందించటం కేంద్రం బాధ్యత అని తేల్చిచెప్పింది. నెలలోపు ప్రామాణికమైన ధరలను నిర్ణయించాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శిని కోరింది. ఒక వేళ ఈ విషయంలో కేంద్రం విఫలమైతే సీజీహెచ్ఎస్లో సూచించిన ధరలనే అమలు చేయాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటామన్నది.