న్యూఢిల్లీ : నీట్ పీజీ-2021 అడ్మిషన్లలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడి వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్పై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు గురువారం విచారణ జరిపింది. నీట్ పీజీలో ఆలిండియా కోటాలో 10శాతం ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (Economically Weaker Section-EWS), 27 శాతం ఇతర వెనుకబడిన తరగతులకు (Other Backward Class- OBC) రిజర్వేషన్లు అమలు చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే.
ఆర్డినెన్స్ సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కౌన్సెలింగ్పై గతంలో ఇచ్చిన స్టేను కోర్టు పొడగించింది. ఈడబ్యూఎస్ కేటగిరి ప్రమాణాలను పునః పరిశీలిస్తున్నట్లు కేంద్రం ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు వార్షిక ఆదాయ పరిమితి రూ.8లక్షలు ఉంచాలో.. లేదో సమీక్షిస్తున్నట్లు పేర్కొంది.
స్పందించిన ధర్మాసనం నాలుగు వారాల్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరి ప్రమాణాల పునః పరిశీలన విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే ఏడాది జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. నీట్ పీజీ సెట్ పరీక్ష సెప్టెంబర్ 12న జరగ్గా.. ఈ ఏడాది దాదాపు 16లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే, ఎంసీసీ కౌన్సెలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. మెడికల్ అడ్మిషన్ల కోసం ఆల్ ఇండియా కోటాలో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోటాపై నిర్ణయం పెండింగ్లో ఉన్నందున కౌన్సెలింగ్ ప్రారంభించమని కేంద్రం సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చిన నేపథ్యంలో నిలిచిపోయింది.