న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: పరస్పర అంగీకారంతో కూడిన సహ జీవన సంబంధాలు విచ్ఛిన్నమైన తర్వాత వాటిని నేరంగా పరిగణించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు సోమవారం హెచ్చరించింది. ఇటువంటి ఏర్పాట్లు సహజంగానే ఇద్దరు భాగస్వాములకు అనిశ్చితి, చట్టపరమైన నష్టాలను తెస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది. పెండ్లి చేసుకుంటానని బూటకపు వాగ్దానం చేసి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఒక మహిళ చేసిన ఆరోపణలకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న సహజీవన సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భాగస్వాములలో ఎవరైనా ఎప్పుడైనా విడిపోవడానికి స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్నారు.
‘సంవత్సరాల తరబడి వారు కలిసి జీవించారు. ఒకవేళ వారు విడిపోతే ఆ మహిళ పురుషుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేయాల్సి వస్తుంది’ అని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. ఆ వ్యక్తికి ఇప్పటికే వివాహమైందని, అతను ఆమెను మోసం చేసి వేధించాడని మహిళ తరఫు న్యాయవాది వాదించగా ‘పరస్పర అంగీకారంతో సంబంధం ఏర్పడినపుడు ఇక నేరం అన్న ప్రశ్న ఎక్కడ వస్తుంది? వారిద్దరూ కలిసి జీవిస్తున్నారు.
అతని ద్వారా ఒక బిడ్డను కూడా ఆమె కనింది. పెండ్లి చేసుకోలేదు కాని ఆమె తనపై లైంగిక దాడి జరిగిందని అంటున్నది’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వివాహం చేసుకుని ఉంటే మహిళకు న్యాయపరమైన హక్కులు చాలా బలంగా ఉండేవని న్యాయమూర్తి చెప్పారు. ‘రెండో పెండ్లి విషయంలో ఆమె కోర్టును ఆశ్రయించి ఉండవచ్చు’ అని కోర్టు స్పష్టం చేసింది. అయితే బిడ్డ కోసం ఆమె మనోవర్తిని కోరడానికి అవకాశం ఉందని కోర్టు తెలిపింది.