న్యూఢిల్లీ: తీవ్ర నేరాలకు పాల్పడే వారికి విధించే ఉరిశిక్ష విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం ఆలోచించాలని, ఉరిశిక్ష కంటే తక్కువ నొప్పి, బాధతో మరణం సంభవించే ఇతర మార్గాలపై పరిశీలన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు నిపుణులతో చర్చలు జరిపి, అవసరమైన సమాచారం సేకరించాలని సీజేఐతో కూడిన ధర్మాసనం సూచించింది.
ఉరిశిక్ష ప్రత్యామ్నాయ మార్గాలపై శాస్త్ర, సాంకేతికతో పాటు ఇతర కోణాల్లో పరిశీలించి అభిప్రాయాలు చెప్పేందుకు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు, ఎయిమ్స్కు చెందిన నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని న్యాయస్థానం పేర్కొన్నది. మరణశిక్ష అమలులో దేశ, విదేశాల్లో అనుసరిస్తున్న పద్ధతులపై పరిశీలన చేసి మే నెలలోగా నివేదిక ఇవ్వాలని అటార్నీ జనరల్ను కోరింది.