న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషనర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అరుణ్ గోయల్ అపాయింట్మెంట్ ఫైళ్లను చూపాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్రం హడావుడిగా ఆయనను ఈసీగా నియమించడంపై సర్వోన్నత న్యాయస్థానం విస్మయం చెందింది. ఈ నేపథ్యంలో అరుణ్ గోయల్ అపాయింట్మెంట్ ఫైల్ను గురువారం కోర్టుకు సమర్పించాలని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది.
కాగా, పంజాబ్ క్యాడర్కు చెందిన 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్ 37 ఏళ్లుగా పలు హాదాల్లో పని చేశారు. కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్న ఆయన ఈ ఏడాది డిసెంబర్లో రిటైర్ అవుతారు. అయితే ఆయన అనూహ్యంగా గత శుక్రవారం స్వచ్ఛందగా పదవీ విరమణ చేశారు. ఆ వెంటనే అరుణ్ గోయల్ను ఎన్నికల కమిషనర్గా కేంద్ర ప్రభుత్వం శనివారం నియమించింది. దీంతో సోమవారం ఆయన ఆ బాధ్యతలు చేపట్టారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పదవీ విరమణ తర్వాత ఆ స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు.
మరోవైపు ఎన్నికల కమిషనర్ల నియామక వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. సామాజిక కార్యకర్త, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషన్ ఈ సందర్భంగా అరుణ్ గోయల్ను కేంద్రం హడావుడిగా ఈసీగా నియమించడాన్ని ప్రశ్నించారు.
అయితే కేంద్ర నియామకాలు, నిర్ణయాలపై సుప్రీంకోర్టు జోక్యం తగదని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి అన్నారు. ఆయన వాదనను రాజ్యాంగ ధర్మాసనం ఖండించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ ఎంపికకు సంబంధించిన చట్టం చేయాలన్న పార్లమెంట్ ప్రతిపాదన 72 ఏళ్లుగా అమలు కాలేదని విమర్శించింది. ఈ చట్టం కోసం డిమాండ్ చేస్తూ ఒక ఎన్నికల కమిషనర్ తన పదవికి రాజీనామా చేశారని వ్యాఖ్యానించింది. మాజీ సీఈసీ, దివంగత టీఎన్ శేషన్ ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలను పరోక్షంగా ప్రస్తావించింది.
కాగా, ఎన్నికల సంఘం వ్యవస్థ ప్రకారమే సీఈసీ, ఈసీల ఎంపిక జరుగుతున్నదని అటార్నీ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు. ప్రధాని నేతృత్వంలోని మంత్రివర్గం సిఫార్సు చేసిన వారిలో ఒకరిని రాష్ట్రపతి ఎంపిక చేస్తారని వెల్లడించారు. ఆ మెకానిజాన్ని తప్పుపట్టడం తగదని అన్నారు.
ఈ నేపథ్యంలో ఆ వ్యవస్థ ఏమిటన్నది తాము తెలుసుకోవాలనుకుంటున్నామని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ‘ఆ మెకానిజం ఏమిటో మేం చూడాలనుకుంటున్నాం. మేం దానిని విరోధిగా పరిగణించం. దానిని మా రికార్డు కోసం ఉంచుకోం. కానీ ప్రతిదీ ‘హంకీ డోరీ’ (అంతా సక్రమమే) అని మీరు చెప్పిన దానిని మేం తెలుసుకోవాలనుకుంటున్నాం. మీకు రేపటి (గురువారం) వరకు సమయం ఉంది. ఎన్నికల కమిషనర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అరుణ్ గోయల్ అపాయింట్మెంట్ ఫైల్ను చూపండి’ అని కేంద్రాన్ని ఆదేశించింది.