న్యూఢిల్లీ/ కోల్కతా: ఒక కేసు విచారణ నుంచి జడ్జిని తప్పిస్తూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వు హైకోర్టు, సుప్రీం కోర్టు మధ్య వివాదానికి దారి తీసింది. విచారణ నుంచి తనను తొలగించిన కేసుకు సంబంధించిన వివరాలు అర్ధరాత్రిలోగా అందించాలని శుక్రవారం కలకత్తా హైకోర్టు జడ్జి సుప్రీం ఉన్నతాధికారులను ఆదేశించటం.. ఆ ఆదేశాలను సుప్రీం నిలిపివేస్తూ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేయటం సర్వత్రా చర్చకు దారితీసింది.
నిబంధనలను అతిక్రమించి సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, ఏ కేసును ఏ బెంచ్ విచారించాలన్న విషయం సుప్రీం కోర్టు నిర్ణయించలేదని కొందరు న్యాయ నిపుణులు అంటుండగా, న్యాయవ్యస్థకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానమే సుప్రీం అని, దాని ఉత్తర్వులను కింది కోర్టులు ప్రశ్నించజాలవని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కేసు వివరాలు పరిశీలిస్తే.. బెంగాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాల్లో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపణలొచ్చాయి. ఈ కేసులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీకి పాత్ర ఉందని సీబీఐ ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలో కేసు విచారిస్తున్న జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ ఒక చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చి అభిషేక్పై వ్యాఖ్యలు చేశారని సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన సుప్రీం ఆయనను ఆ కేసు నుంచి తప్పించింది. దీనిపై జడ్జి గంగోపాధ్యాయ తీవ్రంగా స్పందించారు. బెంగాల్లో హై ప్రొఫైల్ అయిన టీచర్ల నియామక కుంభకోణం కేసును విచారిస్తున్న తనను తప్పించడానికి దారితీసిన పత్రాలను అర్ధరాత్రి 12 గంటల లోగా సమర్పించాలని సుప్రీం కోర్టు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రత్యేక విచారణ జరిపిన సుప్రీంకోర్టు గంగోపాధ్యాయ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేసింది.