న్యూఢిల్లీ: జ్ఞానవాపీ మసీదు-కాశీ విశ్వనాథ్ ఆలయ వివాదం కేసులో ఇవాళ సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జ్ఞానవాపీ మసీదులో ఉన్న వాజూఖానా(Wazukhana)లో శివలింగాన్ని శుభ్రం చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. వారణాసి జిల్లా అధికారి పర్యవేక్షణలో వాజూఖానాను క్లీన్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. వాటర్ ట్యాంక్ను శుభ్రం చేసేందుకు తాము అనుకూలంగా ఉన్నట్లు జ్ఞానవాపి మసీదు మేనేజ్మెంట్ కమిటీ పేర్కొన్నది. రెండేళ్ల నుంచి సుప్రీం ఆదేశాలతో ఆ ట్యాంక్ను సీల్ చేశారు.
అయితే నమాజ్కు వెళ్లేందుకు ముస్లింలు వాజుఖానాలో సంప్రదాయ క్రియలను పాటిస్తుంటారు. వాటర్ ట్యాంకులో ఉన్న చేపలు గత ఏడాడి డిసెంబర్లో మరణించాయని, వాటి నుంచి దుర్గంధం వస్తుందని కోర్టులో ఓ పిటీషన్ వేశారు. ఆ ట్యాంక్లోనే శివలింగం ఉందని, దాన్ని క్లీన్గా ఉంచాలని, చేపల మృతితో ఆ నీరు మురికిగా మారిందని దరఖాస్తులో ఫిర్యాదుదారులు ఆరోపించారు. అడ్వకేట్ విష్ణు శంకర్ జైన్ కోర్టులో అప్లికేషన్ వేశారు.