న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో నిర్మాణ కార్యకలాపాలను సుప్రీం కోర్టు మళ్లీ నిషేధించింది. నిర్మాణరంగంపై ఆధారపడ్డ కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆర్థిక సాయం అందించాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం బుధవారం రాత్రి అప్లోడ్ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో ఆదేశాలిచ్చింది. ఎన్సీఆర్, పరిసర ప్రాంతాల్లోని వాయు కాలుష్యాన్ని గత సంవత్సరాల్లో అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ నిర్ణయించాల్సి ఉందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని కోర్టు సూచించింది. వాయు నాణ్యత క్షీణించే వరకు చూడకుండా.. సమీప భవిష్యత్లో వాయు కాలుష్యం అంచనాల ఆధారంగా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి ఆదేశాల వరకు ఎన్సీఆర్ పరిధిలో నిర్మాణ కార్యకలాపాలపై తిరిగి నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్లంబింగ్ వర్క్, ఇంటీరియర్ డెకరేషన్, ఎలక్ట్రికల్ వర్క్, కార్పెంట్ వర్క్ తదితర కాలుష్య రహిత కార్యకలాపాలను కొనసాగించేందుకు సీజేఐ అనుమతించారు.