న్యూఢిల్లీ, మార్చి 13 : ఈ ఏడాది భూగ్రహం అత్యంత శక్తిమంతమైన ఎల్నినో దశలో ప్రవేశించవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇటీవలి దశాబ్దాల్లో ఇదే అత్యంత శక్తిమంతమైనదని వారు పేర్కొంటున్నారు. సూపర్ ఎల్నినోగా పేర్కొంటున్న ఈ దశ వచ్చే జూన్ నుంచి ప్రారంభం కావచ్చునని అంచనా వేస్తున్నారు. సూపర్ ఎల్నినో వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారవచ్చని, ఉష్ణోగ్రతలు భారీగా పెరగవచ్చని, రుతుపవనాలు అసాధారణంగా ఉండవచ్చని భావిస్తున్నారు.
భూగ్రహం బలమైన లేదా సూపర్ ఎల్నినో దశను ఎదుర్కొనవచ్చని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కోస్ట్స్ నుంచి అందిన వివరాలు వెల్లడించాయి. కాగా, ఎల్నినో పరిస్థితులు ఎప్పుడు ఏర్పడినా ఆ ప్రభావం భారత్పై ఎక్కువగా ఉంటున్నది. ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడం, వర్షపాతం తగ్గిపోవడం జరుగుతుంది. భారత్లో వేసవి అనంతర రుతుపవనాలు అధికంగా భూమి, సముద్రం మధ్య ఉండే ఉష్ణోగ్రతల మార్పులపై ఆధారపడి ఉంటాయి.