వాషింగ్టన్, ఏప్రిల్ 14: భారత్లో నిరుపేద విద్యార్థులకు విద్యను అందుబాటులో తీసుకొచ్చేందుకు త్వరలో ‘ఆన్లైన్ విద్యా వేదిక’ను ప్రారంభిస్తున్నట్టు ‘సూపర్ 30’ వ్యవస్థాపకుడు, ప్రముఖ గణితవేత్త ఆనంద్కుమార్ ప్రకటించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్యను మరింత ఎక్కువమంది విద్యార్థులకు చేరువ చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. వాషింగ్టన్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ‘పేదలు తమ జీవితాలను మార్చుకోవాలనే ఆకాంక్షను ‘సూపర్ 30’ పెంచేలా చేసింది.
ఇక్కడ్నుంచి వెళ్లిన కొంతమంది విద్యార్థులు తమ భవిష్యత్ను మార్చుకున్నారు. ఒక తరం మార్పునకు విద్య కారణమైంది. ‘సూపర్ 30’ని మరింత విస్తరించేందుకు కొత్తగా ఆన్లైన్ విద్యా వేదికను స్థాపించబోతున్నా. దీంతో పేదల ఇంటి ముందుకు విద్యను తీసుకెళ్తా’ అని అన్నారు. పేదరికం కారణంగా ఎంతోమంది ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రపంచం దృష్టిలో పడటం లేదని, అలాంటి వారికోసం ఆన్లైన్ విద్యా వేదికను తీసుకొస్తున్నట్టు చెప్పారు.