న్యూఢిల్లీ, డిసెంబర్ 10: హిమాచల్ప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్కు కాంగ్రెస్ అధిష్ఠానం తెర దించింది. ఆ రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు సుఖ్విందర్ సింగ్ సుఖు పేరును ముఖ్యమంత్రిగా ఖరారు చేసింది. హమీర్పూర్ జిల్లా నాదౌన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుఖు.. ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా ముకేశ్ అగ్నిహోత్రిని పార్టీ అధిష్ఠానం ఓకే చేసింది. శనివారం సాయంత్రం కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమై శాసనసభా పక్ష నేతగా సుఖును ఎన్నుకొన్నారు.
కాగా, అంతకుముందు శుక్రవారం సాయంత్రం రాష్ర్టానికి కాబోయే ముఖ్యమంత్రిని నిర్ణయించే అధికారాన్ని ఆ పార్టీ అధిష్ఠానానికి అప్పగిస్తూ హిమాచల్ప్రదేశ్ ఎమ్మెల్యేలు తీర్మానించారు. సీఎం పీఠం పోటీలో మొన్నటిదాకా ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన ముకేశ్ అగ్నిహోత్రి, సుఖు, సీనియర్ నేత హర్షవర్ధన్ చౌహాన్, ప్రతిభాసింగ్ నిలిచారు. అయితే, అధిష్ఠానం సుఖు పేరునే ఫైనల్ చేసింది. మొత్తం 68 సీట్లకు గానూ కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకొని అధికారాన్ని చేజిక్కించుకొన్నది. ఆదివారం నాటి ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు.
ఎవరీ సుఖ్విందర్ సింగ్ సుఖు..
వృత్తిరీత్యా న్యాయవాది అయిన సుఖు.. సిమ్లాలోని హిమాచల్ప్రదేశ్ యూనివర్సిటీలో చదువుతూ సామాజిక కార్యకర్తగా ఎదిగారు. 1980ల్లో కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా స్టేట్ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చాక 2000ల్లో స్టేట్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడయ్యారు. 2019 నుంచి ప్రతిభాసింగ్ బాధ్యతలు చేపట్టే వరకు పీసీసీ చీఫ్గా పనిచేశారు.
గుజరాత్ సీఎంగా మళ్లీ భూపేంద్రకే పగ్గాలు
గాంధీనగర్: గుజరాత్ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకొన్న బీజేపీ. సీఎం అభ్యర్థిగా భూపేంద్ర పటేల్నే కొనసాగించనున్నది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆయనను శనివారం శాసనసభాపక్ష నేతగా ఎన్నుకొన్నారు. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా ఆయన పదవీ స్వీకారం చేయనున్నారు.