Jairam Thakur: హిమాచల్ప్రదేశ్లో సుఖ్విందర్సింగ్ సుఖు నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఏ క్షణమైనా కుప్పకూలిపోవచ్చని ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ అన్నారు. ప్రస్తుతం సుఖు సర్కారు మైనారిటీలో ఉన్నదని వ్యాఖ్యానించారు. అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి తీరుపై అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు.
అయితే హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్షకు బీజేపీ డిమాండ్ చేయనుందా అని మీడియా ప్రశ్నించగా.. రేపు సభలో బడ్జెట్ ప్రవేశపెడుతారని, బడ్జెట్పై చర్చలో పాల్గొంటామని, అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కానీ, ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినట్లు నాకు అనిపిస్తోందని ఆయన చెప్పారు.
ఇవాళ హిమాచల్ప్రదేశ్లో ఏకైక రాజ్యసభ స్థానానికి ఓటింగ్ జరిగింది. బీజేపీ గెలుపుపై ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీలోని మొత్తం 68 మంది సభ్యులకుగాను 67 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనారోగ్య కారణాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్సింగ్ బబ్లూ ఓటింగ్లో పాల్గొనలేదు.
కాగా రాష్ట్రంలోని ఏకైక రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత అభిషేక్ మనుసింఘ్వీ, బీజేపీ నుంచి హర్ష్ మహాజన్ పోటీపడ్డారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లతో స్పష్టమైన మెజారిటీ వచ్చింది. బీజేపీకి 25 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అయినా కాంగ్రెస్ ఓట్లతో తమ అభ్యర్థే గెలుస్తాడని బీజేపీ ఆశ పడుతోంది.