సుఖేశ్ చంద్రశేఖర్… ఇదో సంచలనం సృష్టిస్తున్న విషయం. రాన్బాక్సీ మాజీ ప్రమోటర్లైన మల్విందర్ సింగ్, శివందర్ సింగ్కు బెయిల్ ఇప్పిస్తానని వారి భార్యలను నమ్మించాడు. ఇలా నమ్మించి ఏకంగా 200 కోట్ల రూపాయలను వారి వద్ద నుంచి వసూలు చేశాడు. ఈ విషయం ఢిల్లీ పోలీసులకు తెలియడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. తిహార్ జైల్లో ఉంటున్నాడు. జైల్లో ఉంటూ ఊచలు లెక్కపెడుతున్నా…. తీరును మాత్రం ఏమాత్రం మార్చుకోలేదని, జైలు అధికారులకు కూడా లంచాలిస్తున్నాడని తాజా కథనం. ఈ విషయాన్ని జాతీయ మీడియా సంస్థలు కోడై కూస్తున్నాయి.
జైల్లో అత్యంత ఖరీదైన వసతుల కోసం, విలాసాల కోసం, స్వేచ్ఛా వాతావరణం కోసం జైలు అధికారులకు ఏకంగా ప్రతి నెలా కోటి రూపాయల వరకూ లంచాన్ని ఇస్తున్నాడని ఈడీ దర్యాప్తులో తేలింది. దీంతో ఈడీ అధికారులు నివ్వెరపోయారట. జైలు ఊచలు లెక్కపెడుతున్నా… ఆయన ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని తెలుస్తోంది. పైగా తనకు వసతులు సరిగ్గా లేవని, తన భార్యను ఎక్కువ సార్లు కలవనీయడం లేదని జైలు ఉన్నతాధికారులకు సుఖేశ్ ఫిర్యాదులు కూడా చేశారని తెలుస్తోంది. ఇక… జైల్లో ఫోన్లు మాట్లాడటం కోసం 15 రోజులకు గాను 50 లక్షలకు పైగానే ముట్టజెప్పినట్లు వార్తలొస్తున్నాయి. ఇంకా మరెన్ని విషయాలు బయటికి వస్తాయో చూడాలి.
ఇక జైలు వేదికగా ఆయన అనేక మంది బాలీవుడ్ హీరోయిన్లను కూడా కలిసినట్లు వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా జాక్వెలిన్, నోరా ఫతేహి పేర్లు మాత్రం ప్రస్తుతానికి వినిపిస్తున్నాయి. ఇలా ఓ పది మంది పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక… జాక్వెలిన్కు కోట్ల రూపాయల విలువైన బహుమతులు అంటే.. లగ్జరీ కార్లు, డైమండ్లు లాంటివి ఇచ్చాడని, నోరాకు కూడా అంతే విలువైన బహుమతులు ఇచ్చాడని తెలుస్తోంది. దీంతో జాక్వెలిన్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో నోరా ఫతేహి స్పందించింది. ఈ కారును సుఖేశ్ ఇవ్వలేదని, ఆయన భార్య లీనా మారియా ఇచ్చిందని బాంబు పేల్చింది. ఈ కేసులో తానే బాధితురాలని, మనీ లాండరింగ్తో తనకు ఏమాత్రం సంబంధమే లేదని ఈడీ అధికారులకు తెలిపింది.
జైల్లో ఉంటూ.. మిమిక్రీ చేస్తూ… అదితీ సింగ్ను ట్రాప్ చేసిన సుఖేశ్….
జైల్లో ఉంటూనే సుఖేశ్ చంద్రశేఖర్ రాన్బాక్సీ మాజీ ప్రమోటర్ అయిన శివేందర్ సింగ్ భార్య అదితీ సింగ్కు టచ్లోకెళ్లాడు. అధునాతన టెక్నాలజీ సహాయంతో వాయిస్ మాడ్యులేషన్, మొబైల్ అప్లికేషన్లతో ఆమెను ట్రాప్ చేశాడు. తన భర్త శివేందర్ సింగ్కు ఎలాగైనా బెయిల్ ఇప్పిస్తానని, తనను పూర్తిగా నమ్మాలని పేర్కొన్నాడు. తాను కేంద్రహోంశాఖలో ఓ ఉన్నతాధికారినని, ఉన్నతాధికారులందరూ తెలుసంటూ, వారిని కలిపిస్తామంటూ ఆమెను బుకాయించాడు.
తన భర్తకు బెయిల్ రావడానికి 200 కోట్లు కావాలన్నాడు. సుఖేశ్ చంద్రశేఖర్ చెప్పిన మాయ మాటలకు అదితి సింగ్కు ఎక్కడా అనుమానం రాకపోవడం విచిత్రం. చివరకు ఆయనకు ఆ 200 కోట్ల భారీ మొత్తాన్ని ముట్టజెప్పింది. ”వాళ్లు నన్ను బెదిరించారు. భయపెట్టించారు. దీంతో నేను 200 కోట్లు ముట్టజెప్పా. నా దగ్గరున్న ఆభరణాలు.. ఇతరత్రా అన్నీ కలిపి 200 కోట్లు ఇచ్చాను. అయినా నన్ను భయపెడుతూనే ఉన్నారు” అని అదితి సింగ్ ఈడీ అధికారులకు తెలిపింది. ఆ తర్వాత కొన్ని రోజులకు గాని ఆమెకు తెలిలేదు కదా అంటే… ఆ ఫోన్ చేసింది ఓ ఆర్థిక మోసగాడని. దీంతో ఈడీ రంగంలోకి దిగి, అరెస్ట్ చేసింది.