Sudha Murthy | ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ (Infosys Co-founder) నారాయణ మూర్తి (Narayana Murthy) భార్య సుధామూర్తి (Sudha Murty ) అందరికీ సుపరిచితులే. విద్యావేత్త, రచయిత, అంతకుమించి గొప్ప మానవతామూర్తిగా పేరు పొందారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ (Infosys Foundation chairperson) గా కొనసాగుతున్నారు. కాగా, తాజాగా సుధామూర్తి.. బాలీవుడ్ ప్రముఖ టాక్ షో ‘ది కపిల్ శర్మ షో’ (Kapil Sharma Show) లో పాల్గొన్నారు. ఆమెతోపాటు నటి రవీనా టాండన్, నిర్మాత గునీత్ మోంగా కూడా పాల్గొన్నారు. టాక్ షోలో భాగంగా సుధామూర్తి తన వైవాహిక, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తన భర్త నారాయణ మూర్తిని తాను మొదటిసారి ఎప్పుడు కలిశాను, అప్పుడు ఆయన గురించి తాను ఏమనుకున్నానన్నది సుధామూర్తి ఈ టాక్ షో ద్వారా చెప్పారు. ఈ సందర్భంగా సుధామూర్తి మాట్లాడుతూ.. ‘నాకు ప్రసన్న అనే ఓ స్నేహితురాలు ఉండేది. తను ప్రతి రోజూ నాకోసం ఓ పుస్తకం తీసుకొచ్చేది. అందులో మొదటి పేజీపై నారాయణ మూర్తి పేరుతో పాటు వివిధ ప్రదేశాల పేర్లు కూడా ఉండేవి. దీంతో నారాయణమూర్తి అంతర్జాతీయ బస్ కండెక్టరా..? అని అనుకునేదాన్ని. ఓ రోజు ఆయన్ను కలిసేందుకు వెళ్లా. మూర్తిని చూడకముందు ఆయన ఓ సినిమా హీరోలా చాలా హ్యాండ్సమ్గా ఉంటారని భావించా. కానీ, డోర్ తెరవగానే ఆయన్ను చూసి ‘ఎవరీ చిన్న పిల్లాడు..?’ అని అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చారు. సుధామూర్తి మాటలు విని షోలో ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వులు పూయించారు. ఈ షోకు సంబంధించిన ప్రోమో వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కాగా, సుధామూర్తి-నారాయణమూర్తి 44 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమార్తె అక్షతా మూర్తి, కుమారుడు రోహన్ ఉన్నారు. అక్షతామూర్తి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సతీమణి. కాగా, సుధామూర్తి అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ చాలా సాధారణమైన జీవితం గడుపుతారు. దాతృత్వ కార్యక్రమాలతోనే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. ఆమె చేసిన సామాజిక సేవలను గుర్తించిన కేంద్రం.. పద్మ భూషణ్ (Padma Bhushan) అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే.
Also Read..
Prakash Raj | మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలి : ప్రకాశ్ రాజ్
Donald Trump | లైంగిక ఆరోపణల కేసులో ట్రంప్కు జ్యూరీ షాక్.. భారీ జరిమానా
Pakistan | ఆందోళనలతో అట్టుడుకుతున్న పాక్.. జరభద్రమంటూ తమ పౌరులకు సూచించిన యూఎస్, యూకే, కెనడా