న్యూఢిల్లీ: అవినీతి కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ (Former PM Imran Khan) అరెస్టుతో పాకిస్థాన్ (Pakistan) అట్టుడికిపోతున్నది. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పీటీఐ (PTI) కార్యకర్తలు, మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. పలుచోట్ల వాహనాలకు నిప్పుపెట్టడంతోపాటు ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు. దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్లో ఉన్న తమ పౌరులు (Citizens), రాయబార సిబ్బంది (Diplomatic staff) అమెరికా (United States), యునైటెడ్ కింగ్డమ్ (UK), కెనడాలు (Canada) హెచ్చరికలు జారీచేశాయి. జరభద్రంగా ఉండాలంటూ (Travel advisories) ఆదేశాలు జారీచేశాయి. జనసమ్మర్థం ఉంటే ప్రాంతాలకు వెళ్లకూడదని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలని తెలిపాయి.
పాకిస్థాన్లోని తమ పౌరులకు యూఎస్ ఎంబసీ ట్రావెల్ అలర్ట్ జారీచేసింది. ఇస్లామాబాద్లో నిరసనకారులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించిన నివేదికలను రాయబార కార్యాలయం పరిశీలిస్తున్నదని తెలిపింది. దేశవ్యాప్తంగా ఆందోళలకు పిలుపునిచ్చారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎంబసీకి సంబంధించి అన్నిరకాల అపాయింట్మెంట్లను రద్దుచేశామని పేర్కొన్నది. అత్యంత జాగరూకతతో ఉండాలని, రద్దీ ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదని సూచించింది. పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, దీనికోసం స్థానిక వార్తలను చూస్తూ ఉండాలని కోరింది. అత్యవసరమైతే తప్ప ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకూడదని చెప్పింది.
ఇదే విధమైన హెచ్చరికలను యూకే ఫారెన్ కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ (FCDO) కూడా తమ పౌరులకు జారీచేసింది. దేశవ్యాప్తంగా భారీగా హింస చెలరేగే అవకాశం ఉందని తెలపింది. ఇక కెనడా ప్రభుత్వం భద్రతా కారణాల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తన పౌరులు, దౌత్య సిబ్బందిని కోరింది. ఉగ్రవాదం, మతపరమైన హింస, కిడ్నాప్లు జరిగే ముప్పు పొంచిఉందని హెచ్చరించింది.
తన భార్య బుషారా బీబీకి చెందిన అల్ ఖదీర్ అనే ట్రస్ట్కు రూ.53 కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా బదలాయింపు చేశారన్న కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ అవినీతి కేసు విచారణ నిమిత్తం మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టుకు వచ్చిన ఇమ్రాన్ఖాన్ను పారామిలటరీ రేంజర్స్ (NAB) కోర్టు ఆవరణ నుంచి బలవంతంగా లాక్కెళ్లి మరీ అరెస్టు చేశారు. దీంతో ఇమ్రాన్ అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పీటీఐ కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు పలుచోట్ల పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రజా ఆస్తుల్ని ధ్వంసం చేశారు. పెషావర్లోని పాకిస్థాన్ రేడియో భవనానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు.
ఈనేపథ్యంలో పాక్ ప్రభుత్వం పంజాబ్ ప్రావిన్స్లో ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేసింది. 144 సెక్షన్ విధించింది. ఫైసలాబాద్లోని హోంమంత్రి ఇంటిపై పీటీఐ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. రావల్పిండిలో ఆర్మీ ప్రధాన కార్యాలయంపై, లాహోర్లోని ఆర్మీ కమాండర్ ఇంటిపై ఇమ్రాన్ అనుచరులు దాడికి దిగారు. ఆర్మీ ప్రధాన కార్యాలయం గేటును ధ్వంసం చేశారు. అడ్డుకోవడానికి వచ్చిన పోలీసుల ముందు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రావల్పిండి, లాహోర్, కరాచీ, గుర్జాన్వాలా, ఫైసలాబాద్, ముల్తాన్, పెషావర్, మర్దాన్లలో పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనకుదిగారు.