న్యూఢిల్లీ: వేగంగా వెళ్తున్న రైలును ఎమర్జెన్సీ బ్రేకులతో నిలిపివేశారు. అయితే ఆకస్మిక కుదుపుల వల్ల (Sudden Jolt of Train) ఇద్దరు రైలు ప్రయాణికులు మరణించారు. జార్ఖండ్లోని కోడెర్మా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒడిశాలోని పూరీ నుంచి ఢిల్లీ వెళ్తున్న పురుషోత్తం ఎక్స్ప్రెస్ శనివారం మధ్యాహ్నం చాలా వేగంతో ప్రయాణించింది. అయితే గోమోహ్, కోడెర్మా రైల్వే స్టేషన్ల మధ్య పర్సాబాద్ సమీపంలో ఓవర్హెడ్ విద్యుత్ లైన్ వైరు తెగిపోవడాన్ని లోకో పైలట్లు గమనించారు. ఒక్కసారిగా విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో రైలును ఆపేందుకు ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. దీంతో భారీ కుదుపులతో రైలు ఆగింది. ఈ నేపథ్యంలో ఆ రైలు ప్రయాణికుల్లో ఇద్దరు చనిపోయారు.
కాగా, ధన్బాద్ రైల్వే డివిజన్ సీనియర్ డివిజనల్ కామర్స్ మేనేజర్ అమరేష్ కుమార్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆ సమయంలో రైలు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందని తెలిపారు. ఈ సంఘటన వల్ల ఆగిపోయిన పురుషోత్తం ఎక్స్ప్రెస్ను డీజిల్ ఇంజిన్ సహాయంతో గోమోహ్ స్టేషన్కు తరలించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో నాలుగు గంటల తర్వాత ఎలక్ట్రిక్ ఇంజిన్ సహాయంతో ఆ రైలు అక్కడి నుంచి కదిలినట్లు వెల్లడించారు.