భువనేశ్వర్: ధరిత్రి దినోత్సవం సందర్భంగా సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పం ఎంతో ఆకట్టుకుంటున్నది. అంతేగాక పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించడంతోపాటు దీని ప్రాముఖ్యాన్ని అందరికీ గుర్తు చేస్తున్నది. సమస్త జీవ రాశికి ఆవాసమైన ప్రకృతిని కాపాడుకోవడం, పర్యావరణ పరిరక్షణపై ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కల్పించి ఆ దిశగా చర్యలను ప్రొత్సహించేందుకు ప్రతి ఏటా ఏప్రిల్ 22ను ధరిత్రి దినోత్సవం (ఎర్త్ డే)గా జరుపుకుంటారు.
ఈ నేపథ్యంలో ఈ రోజును పురస్కరించుకుని అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన ఒడిశాకు చెందిన ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఒక సైకత శిల్పాన్ని రూపొందించారు. ధరిత్రి దినోత్సవంపై ప్రజలకు ముఖ్యమైన సందేశం అందించడంలో భాగంగా పూరీ బీచ్లో అద్భుతమైన కళాకృతిని సృష్టించారు. ప్రకృతి మాతతో మానవుల అనుసంధాన్ని గుర్తు చేసేలా చెట్టు, మానవుడు చేతులు కలుపుతున్నట్లుగా ఉన్న సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.
కాగా, సుదర్శన్ పట్నాయక్ ఈ కళాకృతి ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘సహజ వనరులను కాపాడుతామని ధరిత్రి దినోత్సవం రోజున మనం ప్రతిజ్ఞ చేద్దాం. భగవంతుడు సృష్టించిన జీవరాశి అంతటికి మంచి ప్రదేశంగా భూమిని తీర్చిదిద్దుదాం. పచ్చదనాన్ని పెంచేందుకు కలిసి పని చేద్దాం’ అని అందులో పేర్కొన్నారు. మరోవైపు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ధరిత్రి దినోత్సవం సందర్భంగా సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పంతోపాటు ఆయన ఇచ్చిన సందేశం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నది. ఆయనకు ధన్యవాదాలు చెబుతూ పలువురు ట్వీట్లు చేశారు.
On #EarthDay2022 let us pledge to conserve the natural resources & make Earth a better place for all creations of God- Let us work together to make this Greener . #WorldEarthDay 🌍 My SandArt at Puri beach. pic.twitter.com/felcMb5BU2
— Sudarsan Pattnaik (@sudarsansand) April 22, 2022