ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రముఖ సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్.. పూరీ బీచ్ వద్ద.. ప్రధాని నరేంద్ర మోదీ సైకత శిల్పాన్ని నిర్మించారు. మోదీ సైకత శిల్పం కోసం 2035 సముద్ర గవ్వలను పట్నాయక్ ఉపయోగించారు. ఆ సైకత శిల్పం మీద హ్యాపీ బర్త్డే మోదీజీ అని గవ్వలతో లిఖించారు.
హ్యాపీ బర్త్ డే మోదీజి. మహాప్రభు జగన్నాథుడు.. మోదీని ఆశీర్వదించి.. ఆయనకు ఆయురారోగ్యాలకు కలిగించాలని.. ఇంకా మన దేశానికి సేవ చేసే భాగ్యాన్ని మోదీకి కలిగించాలని కోరుకుంటున్నాను. అందుకే.. 2035 గవ్వలతో.. మోదీ సైకత శిల్పాన్ని పూరీ బీచ్ వద్ద నిర్మించాను.. అని సుదర్శన్ పట్నాయక్ ట్వీట్ చేశారు.
దీంతో సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఆ ఫోటోను చూసి మైమరిచిపోతున్నారు. మోదీకి శుభాకాంక్షలు చెబుతున్నారు.
సుదర్శన్ పట్నాయక్.. తరుచూ పూరీ బీచ్ వద్ద సైకత శిల్పాలను నిర్మిస్తుంటారు. ఇటీవల గణేశ్ చతుర్థి సందర్భంగా సముద్ర గవ్వలతో వినాయకుడి సైకత శిల్పాన్ని సుదర్శన్ నిర్మించిన విషయం తెలిసిందే.
ఇక.. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు వేడుకలు.. దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ 71వ బర్త్ డే సందర్భంగా వారణాసిలోని భారత్మాతా టెంపుల్లో 71000 దీపాలను వెలిగించనున్నారు. బీజేపీ కార్యకర్తలు కూడా ప్రధాని మోదీ పుట్టిన రోజు వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.