లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముస్లిం, యాదవ్ వర్గాల ఓట్లను భారీగా తొలగించినట్లు సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ గత నెలలో ఆరోపించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. ముస్లిం, యాదవులు ఓట్ల తొలగింపునకు సంబంధించిన ఆధార పత్రాలను నవంబర్ 10 లోపు సమర్పించాలని కోరింది. ఆయన ఆరోపణలను ఈసీ సీరియస్గా పరిగణించినట్లు తెలుస్తున్నది.
యూపీ మాజీ సీఎం అయిన అఖిలేష్ యాదవ్, గత నెల 29న ఎస్పీ చీఫ్గా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, క్యాడర్ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముస్లిం, యాదవ్ వర్గాలకు చెందిన 20,000కు పైగా ఓటర్లను జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు.
యూపీ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి ఓటు వేశారని అఖిలేష్ యాదవ్ అన్నారు. అయితే బీజేపీ తన అధికారాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిందని విమర్శించారు. బలవంతంగా ప్రజా ప్రభుత్వాన్ని లాక్కొని వారి ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేసిందని ఆరోపించారు. ‘ఎన్నికల సంఘం కూడా మమ్మల్ని నిరాశపరిచింది. బీజేపీ బూత్ ఇన్చార్జ్లకు ఈసీ అండగా నిలిచింది. ముస్లిం ఓటర్ల పేర్లను తొలగించడంలో బీజేపీ ప్రముఖులతో ఈసీ చేతులు కలిపింది’ అని దుయ్యబట్టారు.
కాగా, ముస్లిం, యాదవుల ఓటర్ల తొలగింపుపై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నుంచి ఈసీకి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయినప్పటికీ ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన ఆరోపణలపై ఈసీ సీరియస్గా స్పందించింది. తొలగించిన ఓటరు పేర్లు, సంఖ్య, అటువంటి తప్పుడు తొలగింపులకు సంబంధించిన ఆధారాలు, పత్రాలు, ఎన్నికల అధికారులకు అందిన సంబంధిత ఫిర్యాదులపై అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా డేటాను కోరింది. నవంబర్ 10వ తేదీ లోగా ఈ ఆధారాలను సమర్పించాలంటూ అఖిలేష్ యాదవ్కు నోటీస్ పంపింది. ఆయన చేసిన ఆరోపణలు తీవ్రమైనవని ఈసీ పేర్కొంది. ఎన్నికల సమగ్రత, తద్వారా ప్రజాస్వామ్యంలోని చిక్కులను సవాల్ చేసినట్లుగా అవి ఉన్నాయని అభిప్రాయపడింది.