Brain stroke | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ప్రపంచవ్యాప్తంగా ‘బ్రెయిన్ స్ట్రోక్’ మరణాలు పెరుగుతున్నాయి. జీవన శైలి వ్యాధులు సహా గాలి కాలుష్యం, అధిక ఉష్ణోగ్రతలు కూడా బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు పెరగడానికి ముఖ్య కారణమని ‘లాన్సెట్ న్యూరాలజీ జర్నల్’ తాజా కథనం పేర్కొన్నది. రిస్క్ ఫ్యాక్టర్స్ని (అధిక బరువు, రక్తపోటు, శారీరక శ్రమలేకపోవటం.. మొదలైనవి) పెంచటంలో గాలి కాలుష్యం, అధిక ఉష్ణోగ్రతలు కీలకపాత్ర పోషిస్తున్నాయని పరిశోధకులు కనుగొన్నారు.
1990 తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు 72 శాతం పెరగడానికి అధిక ఉష్ణోగ్రతలూ ఒక కారణమని గణాంకాలు చెబుతున్నాయి. భవిష్యత్తులోనూ ఇది మరింత పెరిగే అవకాశముందని సైంటిస్టులు అంచనా వేశారు. అలాగే, ‘బ్రెయిన్ స్ట్రోక్’ కేసులు పెరగడానికి గాలి కాలుష్యానికి సంబంధముందన్న సంగతి తొలిసారి బయటపడింది.
1990లో 73 లక్షల మందికి తొలిసారి బ్రెయిన్ స్ట్రోక్ రాగా, వీరి సంఖ్య 2021నాటికి 1.19 కోట్లకు చేరుకుంది. స్ట్రోక్స్ను అరికట్టేందుకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలతో సమస్యను ఎదుర్కోలేమని అక్లాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త వాలెరీ ఫిజిన్ చెప్పారు. శుభ్రమైన గాలి, బహిరంగంగా పొగతాగటాన్ని నిషేధించటం.. గత మూడు దశాబ్దాల్లో ‘బ్రెయిన్ స్ట్రోక్’ బారినపడే ముప్పును గణనీయంగా తగ్గించాయని పరిశోధకులు పేర్కొన్నారు.