Mann ki Baat | డెహ్రాడూన్, మే 5: గత నెల 30న ప్రసారమైన ప్రధాని మన్కీ బాత్ 100వ ఎపిసోడ్ వినలేదని డెహ్రాడూన్లోని ఓ స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు రూ.100 జరిమానా విధించింది. దీన్ని నిరసిస్తూ తల్లిదండ్రులు, విద్యార్థుల హక్కుల జాతీయ సంఘం అధ్యక్షుడు ఆరిఫ్ ఖాన్ డెహ్రాడూన్ ముఖ్య విద్యాధికారికి లేఖ రాశారు. పాఠశాల యాజమాన్యం స్కూల్ వాట్సాప్ గ్రూపులో విద్యార్థులకు నోటీస్ పంపిందని స్క్రీన్ షాట్లను ఆధారంగా చూపారు.
మన్కీ బాత్ వినడానికి స్కూలుకు హాజరు కాని విద్యార్థులు రూ.100 జరిమానా చెల్లించాలని లేదంటే మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాలని ఆ నోటీస్లో ఉంది. స్కూల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని ఆరిఫ్ ఖాన్ డిమాండ్ చేశారు. దీనిపై శుక్రవారం ముఖ్య విద్యాధికారి స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి జీఆర్డీ నిరంజనాపూర్ అకాడమీ ఆఫ్ డెహ్రాడూన్కు షోకాజ్ నోటీస్ జారీ చేశామన్నారు. మూడు రోజుల్లోగా వారు సరైన వివరణ ఇవ్వకపోతే విద్యార్థుల నుంచి డబ్బు వసూలు చేసినట్టు భావించి శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.