గౌహతి: అస్సాంలోని సిల్చర్లో ఉన్న ఎన్ఐటీ(NIT Silchar) కాలేజీ క్యాంపస్లో శుక్రవారం రాత్రి విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో క్యాంపస్ స్టూడెంట్స్ ఆందోళన చేపట్టారు. అయితే ఆందోళన చేస్తున్న విద్యార్థుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఓ విద్యార్థి హాస్టల్ రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎగ్జామ్లో ఆ విద్యార్థి ఫెయిల్ అయ్యాడు. బ్యాక్లాగ్ పేపర్లను కూడా క్లియర్ చేయలేకపోయాడు. తర్వాత సెమీస్టర్కు రిజిస్టర్ చేసుకునేలా అనుమతి ఇవ్వాలని ఆ విద్యార్థి కాలేజీ యాజమాన్యాన్ని కోరాడు. కానీ ఆ అభ్యర్థనను కాలేజీ తిరస్కరించింది.
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని పోస్టుమార్టమ్ కోసం పంపారు. ప్రస్తుతం కాలేజీ క్యాంపస్లో పరిస్థితి అదుపులో ఉంది. కాలేజీ యాజమాన్యం ప్రవేశపెట్టిన కొత్త మార్గదర్శకాలపై విద్యార్థులు ఆందోళన చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్ఐటీ సిల్చర్ అడ్మినిస్ట్రేషన్ పట్ల విద్యార్థులు సంతోషంగా లేరని తెలుస్తోంది ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ను కలవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి.. ఫస్ట్ ఇయర్ నుంచే కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నట్లు కాలేజీ యాజమాన్యం పేర్కొన్నది.