న్యూఢిల్లీ: తొలిసారిగా 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు ఉన్న టీనేజ్ యువతకు కోవిడ్ టీకాలు ఇవ్వనున్నట్లు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఆ దిశగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. చిన్నారులు వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకునే ఏర్పాట్లు చేసినట్లు కోవిన్ ఫ్లాట్ఫామ్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. కోవిన్ యాప్లో 15-18 ఏళ్ల లోపు వారు జనవరి ఒకటో తేదీ నుంచి టీకా కోసం నమోదు చేసుకోవచ్చు అని ఆయన చెప్పారు. అయితే స్టూడెంట్ ఐడీ కార్డుతోనూ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేసుకునే వెసలుబాటు కల్పిస్తున్నట్లు డాక్టర్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. కోవిన్ ఫ్లాట్ఫామ్లో అదనంగా టెన్త్ ఐడీ కార్డు రిజిస్ట్రేషన్ను కలిపినట్లు ఆయన చెప్పారు. ఆధార్ కార్డు లేని టీనేజ్ విద్యార్థులకు ఈ ఆప్షన్ వర్తిస్తుందని ఆయన తెలిపారు.
పిల్లలకు ఇచ్చే టీకాలు ఇవే..
దేశంలోని చిన్నారులకు భారత్ బయోటెక్కు చెందిన కోవాగ్జిన్ లేదా జైడస్ క్యాడిల్లాకు చెందిన జైకోవ్డీ వ్యాక్సిన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మూడవ వ్యాక్సిన్ రూపంలో సీరం సంస్థకు చెందిన నోవావాక్స్ కూడా అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏడు నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలపై ట్రయల్స్ నిర్వహించేందుకు సీరంకు డ్రగ్ కంట్రోలర్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక బయోలాజికల్ ఈ సంస్థకు చెందిన కోర్బీవాక్స్ కు కూడా అడ్వాన్స్డ్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి దక్కింది. అయిదేళ్లు దాటిన చిన్నారులపై కోర్బీవ్యాక్స్ టీకా ట్రయల్స్ నిర్వహించనున్నారు. 15-18 ఏళ్ల పిల్లలపై కోవాగ్జిన్ అద్భుతమైన రెస్పాన్స్ చూపించినట్లు డాక్టర్ ఎన్కే అరోరా తెలిపారు. పెద్దలకు వాడిన ఫార్ములాతోనే చిన్నారులకు టీకాలు తయారు చేసినట్లు గతంలో భారత్ బయోటెక్ చెప్పింది.