Kerala Exit Polls : కేరళ రాష్ట్రంలో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF), ప్రతిపక్ష యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) మధ్య గట్టి పోటీ ఉంటుందని ఎగ్జిట్పోల్ సర్వేలు అంచనా వేశాయి. అదే సమయంలో అన్ని సంస్థలు ప్రతిపక్ష యూడీఎఫ్ కూటమికి స్వల్ప ఆధిక్యాన్ని చూపించాయి. పశ్చిమ బెంగాల్ (West Bengal), తమిళనాడు (Tamil Nadu), కేరళ (Kerala) రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నేటితో ముగిసింది. పశ్చిమబెంగాల్లో రెండు విడతల్లో తమిళనాడు, కేరళలో ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. ఇవాళ బెంగాల్లో రెండో విడత పోలింగ్ జరగడంతో పోలింగ్ ప్రక్రియకు పూర్తిగా తెరపడింది. ఈ క్రమంలో జాతీయ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ (Exit polls) అంచనాలను వెల్లడించాయి.
మ్యాట్రిజ్ సర్వే సంస్థ అంచనాల ప్రకారం.. ప్రతిపక్ష యూడీఎఫ్ 70 నుంచి 75 స్థానాలు గెలుస్తుంది. అదే సమయంలో అధికార ఎల్డీఎఫ్ 60 నుంచి 65 దక్కించుకుంటుంది. ఇక ఎన్డీఏ కూటమికి 3 నుంచి 5 స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఈ సర్వే ప్రకారం అధికారం ఎవరిది అనే విషయంలో స్పష్టత కొరవడింది. ఇక ఓట్ వైబ్ సర్వే సంస్థ అంచనాల ప్రకారం చూస్తే.. ప్రతిపక్ష యూడీఎఫ్ 79 నుంచి 80 స్థానాలు దక్కించుకుని అధికారంలోకి వస్తుంది. అధికార ఎల్డీఎఫ్ 58 నుంచి 68 స్థానాలు గెలిచి స్వల్ప తేడాతో అధికారానికి దూరమవుతుంది. ఎన్డీయే కూటమికి సున్నా నుంచి 4 స్థానాలు మాత్రమే దక్కే అవకాశం ఉంది.
అదేవిధంగా పీపుల్ ఇన్ సైట్ సర్వే సంస్థ ప్రకారం.. ప్రతిపక్ష యూడీఎఫ్ 66 నుంచి 76 స్థానాలు గెలుస్తుంది. అధికార ఎల్డీఎఫ్ 58 నుంచి 68 స్థానాలు దక్కించుకుంటుంది. బీజేపీకి 10 నుంచి 14 స్థానాలు దక్కనున్నాయి. ఈ సర్వే అంచనాలను బట్టి చూస్తే అధికారం దక్కితే ప్రతిపక్ష యూడీఎఫ్కు దక్కుతుంది. లేదంటే హంగ్ ఏర్పడుతుంది.