న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కు తీవ్ర కొరత నెలకొంది. పలు రాష్ట్రాలు తమకు లభించిన ఆక్సిజన్ కోటా అందకపోవడంతో ప్రాణవాయువు కోసం కేంద్రాన్ని అభ్యర్ధిస్తున్నాయి. ఇక ఆక్సిజన్ కు అనూహ్యంగా పెరిగిన డిమాండ్ ను అధిగమించేందుకు దేశవ్యాప్తంగా పలు స్టీల్ ప్లాంట్లు వివిధ రాష్ట్రాలకు భారీగా మెడికల్ ఆక్సిజన్ ను సరఫరా చేస్తున్నాయని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం వెల్లడించారు.
స్టీల్ ప్లాంట్లు ఇప్పటివరకూ పలు రాష్ట్రాలకు 1.43 లక్షల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను సరఫరా చేశాయని ఆయన తెలిపారు. మరోవైపు దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గడిచిన 24 గంటల్లో వరసగా మూడో రోజూ మూడు లక్షలకు పైగా తాజా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.